రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారు: వెంకయ్యపై రజిని సంచలన వ్యాఖ్యలు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకయ్య నాయుడు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని వ్యాఖ్యానించడంతో సభలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. చివరికి ఉప రాష్ట్రపతి సైతం నివ్వెరపోయారు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్య.. తన అనుభవాలను ‘‘ లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్’’ పేరిట పుస్తకంలో పొందుపరిచారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం గత ఆదివారం చెన్నైలో జరిగింది. దీనికి హాజరైన రజనీ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని వ్యాఖ్యానించడంతో సభలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. చివరికి ఉప రాష్ట్రపతి సైతం నివ్వెరపోయారు.
ఆ వెంటనే తన ప్రసంగాన్ని కొనసాగించిన రజనీకాంత్.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్య నాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తని.. పొరపాటున రాజకీయ నాయకుడయ్యారని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లోకి కాకుండా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్లి వుంటే గొప్ప మార్గదర్శకుడయ్యే వారని ప్రశంసించారు. అటువంటి ఆధ్యాత్మికవేత్తను తాము పొగొట్టుకున్నామని రజినీ వ్యాఖ్యానించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు సీఎం పళని స్వామి తదితరులు హాజరయ్యారు.