Tamil Nadu urban civic polls: తమిళనాడులో శనివారం ఉదయం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంత కొనసాగుతున్న పోలింగ్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ స్ట్రీమింగ్, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
Tamil Nadu urban civic polls: తమిళనాడులో శనివారం ఉదయం 7 గంటలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్ల మధ్య రాష్ట్ర పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఎలాంటి ఆందోళనకర ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ స్ట్రీమింగ్, CCTV కెమెరాల ద్వారా పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షిస్తుంది. భద్రత కోసం రాష్ట్ర పోలీసులు దాదాపు 1 లక్ష మంది సిబ్బందిని మోహరించడంతో 38 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలలో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. వికలాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, వీల్ చైర్ల లభ్యత వంటి ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు తెలిపారు.
మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలతో సహా 648 పట్టణ స్థానిక సంస్థలలో 12,607 వార్డు సభ్యుల స్థానాలకు 57,778 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 31,000 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చెన్నైలో, 5,013 పోలింగ్ బూత్లలో 213 ఉద్రికత్త ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే, 54 'క్లిష్టమైనవిగా గుర్తించిన పోలీసు యంత్రాంగం దానికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. 390 మొబైల్ బృందాలు సహా మొత్తం 22,000 మంది పోలీసులను ఇక్కడ మోహరించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా. ఓటింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, చివరి 1 గంట కరోనా బారిన పడిన వ్యక్తులకు కేటాయించబడింది.
తిరువళ్లూరు జిల్లాలో, ఆవడి మునిసిపల్ కార్పొరేషన్తో పాటు 8 పట్టణ పంచాయతీలు, 6 మునిసిపాలిటీలకు 315 మంది వార్డు సభ్యులను ఎన్నుకోవలసి ఉంది. తిరువణ్ణామలై జిల్లాలో 10 పట్టణ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలకు 273 వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు 454 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే భాగస్వామ్య పార్టీలైన పీఎంకే, బీజేపీలు సొంతంగా పౌర ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో, అన్నాడీఎంకే మాజీ IAS అధికారి పి శివకామి నేతృత్వంలోని సముగ సమతువ పాడై వంటి చిన్న మిత్రపక్షాలకు వార్డులను కేటాయించింది. అలాగే, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం, నామ్ తమిజర్ కట్చి, మక్కల్ నీది మయ్యమ్లు సైతం పోటీలో దిగాయి.
649 పట్టణ పౌర సంస్థలలో మొత్తం 12,838 వార్డు సభ్యుల పోస్టులకు TNSEC గత నెలలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. 649 పట్టణ స్థానిక సంస్థలు 21 మున్సిపల్ కార్పొరేషన్లు, 138 మునిసిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీలు ఉన్నాయి. తదనంతరం, తూత్తుకుడి జిల్లాలోని కదంబూర్ పట్టణ పంచాయతీలోని మొత్తం 12 వార్డులకు ఎన్నికలు ఉల్లంఘనల కారణంగా రద్దు చేయబడ్డాయి. శివగంగ జిల్లాలోని ఒక పట్టణ పంచాయతీ వార్డు (కానడుకథన్)కు నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తం 218 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
