Liquor Vending Machines: మద్యం ప్రియులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మనకు కావాల్సిన లిక్కర్ బాటిళ్లను స్వయంగా మనమే ఎంచుకొని తీసుకునేలా లిక్కర్ వెండింగ్ మెషీన్లను తీసుకొచ్చింది.
Liquor Vending Machines: తమిళనాడు సర్కార్ మద్యం కొనుగోలును హైటెక్గా మారింది. మద్యం ప్రియులకు కావాల్సిన లిక్కర్ బాటిళ్లను స్వయంగా ఎంచుకొని తీసుకునేలా లిక్కర్ వెండింగ్ మెషీన్లను తీసుకొచ్చింది. తాజాగా చెన్నై మాల్ లోపల ఉన్న ఒక ఎలైట్ స్టోర్ వద్ద తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) ఆటోమేటిక్ మద్యం పంపిణీ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మెషీన్ ద్వారా ఆన్లైన్లో లేదా నగదు రూపంలో డబ్బులు చెల్లించి.. మద్యం బాటిళ్లను పొందవచ్చు. దీనివల్ల కౌంటర్లలో వేచి ఉండాల్సిన సమయం తగ్గుతుందని టాస్మాక్ వర్గాలు తెలిపాయి.
ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది?
వినియోగదారుడు ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్ను తాకిన క్షణంలో ఒక మెను కనిపిస్తుంది. ఆ మెనులో తనకు నచ్చిన మద్యాన్ని ఎంచుకోవచ్చు. అనంతరం డబ్బు చెల్లించే ఆప్షన్ వస్తోంది. డబ్బులను ఆన్లైన్లో లేదా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించిన తరువాత వినియోగదారుడు ఎంచుకున్న బాటిల్ బయటకు వస్తుంది. అయితే.. దీన్ని ట్రయల్ ప్రాజెక్ట్గా లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. ఆచరణ యోగ్యంగా ఉంటే.. మిగతా చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆటోమేటెడ్ పరికరం ద్వారా MRP ధరకే మద్యం పొందవచ్చు.
ఇటీవల వాణిజ్య కాంప్లెక్స్లలో ఎక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదులను అడ్డుకొనేలా మెషిన్లో MRP ధరకే నగదు చెల్లించి మద్యం బాటిళ్లు తీసుకొనేలా వెండింగ్ మెషిన్లు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. అధికార గణాంకాల ప్రకారం.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా 110 హోల్సేల్ మద్యం దుకాణాలు నడుపుతోంది. ఈ షాపుల్లో స్వదేశీ, విదేశీ మద్యం, వివిధ రకాల బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ వాణిజ్య కాంప్లెక్స్లలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్టు తరుచు ఫిర్యాదులందాయి.
ప్రస్తుతం ఈ మెషిన్లను కోయంబేడు సమీపంలోని వీఆర్మాల్, టెన్ స్క్వేర్ మాల్, రాయపేట ఎక్స్ప్రెస్ అవెన్యూ, వేళచ్చేరి ఫినిక్స్మాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వినియోగదారులు తమకు నచ్చిన మద్యం బాటిల్ ధరను మెషిన్లో చెల్లించి నచ్చిన బాటిల్ పొందవచ్చు. అయితే.. వెండింగ్ మెషీన్ల వల్ల మైనర్లు కూడా మద్యం కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తాయని ప్రతిపక్షం విమర్శిస్తున్నాయి. ఆ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిస్తూ.. మాల్స్లోని చేసిన ఈ వెండింగ్ మెషీన్లలో ఉదయం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం పొందవచ్చని, 21 ఏళ్లలోపున్న వారిని దుకాణ సిబ్బంది అనుమతించరని అధికారులు తెలిపారు.
