తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లా‌లో (Virudhnagar district) బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తూరు (Sattur) సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుడు సంభవించడంతో నలుగురు మృతిచెందారు.

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లా‌లో (Virudhnagar district) బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తూరు (Sattur) సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుడు సంభవించడంతో నలుగురు మృతిచెందారు. బాణసంచా తయారీకి కెమికల్స్ మిక్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బాణసంచా ఫ్యాక్టరీ యజమాని కరుప్పసామితో పాటుగా ముగ్గురు కార్మికులు సెంథిల్‌, కాశి, అయ్యమ్మాళ్‌గా గుర్తించారు. వివరాలు.. సత్తూరు సమీపంలో మంజల్ ఒడై పట్టి అనే గ్రామంలో కరుప్పసామికి చెందిన శ్రీ సొలై ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఫ్యాక్టరీలో ఆరు షెడ్స్ ఉండగా.. వీటికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం అనుమతులు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీలో ఎప్పటిలాగే బుధవారం ఉదయం కూడా దాదాపు 15 మంది సిబ్బంది బాణాసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కరుప్పసామి, సెంథిల్ కెమికల్స్ మిక్స్ చేస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని రెండు గదులు నేలకూలాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడివారు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకన్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. సహాయక చర్యలు చేప్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీశారు.

ప్రమాదంలో కరుప్పసామితో సహా నలుగురు మృతిచెందారు. గాయపడిన వారిని శివకాశి, కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక, ఈ పేలుడు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే కొత్త ఏడాది ప్రారంభమైన 5 రోజుల్లోపే విరుద్‌నగర్ జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరగడం ఇంది రెండో ఘటన. జనవరి 1వ తేదీన కళత్తూరు గ్రామంలోని ఆర్‌కేవీఎం బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 5గురు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. 

మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించిన సీఎం స్టాలిన్..
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి లక్షల రూపాయల చొప్పున సాయం అందజేయనున్నట్టుగా ఆయన సీఎం స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు.