కోయంబత్తూరు కారులో పేలుడు:ఉగ్ర వాదుల పనేనా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న కారులో పేలుడు జరిగిన ఘటనకు ఉగ్రలింకులున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కీలక సమాచారం సేకరించారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో నిన్న కారులో గ్యాస్ సిలిండర్ పేలుడుకు ఉగ్రవాదుల పనేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని కొట్టై ఈశ్వరన్ దేవాలయం సమీపంలో ఉన్న కారులో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో జమేషా ముబిన్ మరణించారు.ఈ ఘటన ఆదివారం నాడు ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించిన సమయంలో కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. రోడ్డుపై నిలిపిన కారులో సిలిండర్ పేలిన దృశ్యాలు సీసీటీవీలో కన్పించాయి.
జమేషా ముబిన్ ఇంటి నుండి శనివారంనాడు రాత్రి 11:25గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు ఓ వస్తువును కారులో ఎక్కించారని పోలీసులు గుర్తించారు. అయితే జమేషా ముబిన్ తో ఉన్నమరో నలుగురు ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ముబిన్ నివాసంలో పొటాషియం నైట్రేట్ ,అల్యామినియం పౌడర్, సల్ఫర్, బొగ్గుసహా ఇతర పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు.మూడేళ్ల క్రితమే జమేషాను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. నిన్న కారులో పేలుడు ఘటనకు సంబంధించి ఏదైనా ఉగ్ర కుట్రఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని డీజీపీ శైలేంద్రబాబు వివరించారు.
జమేషా ముబిన్ ను 2019లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు.ఐసీస్ తో సంబంధాలున్నాయనే అనుమానంతో విచారించారు.అతనితో సన్నిహితంగా ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లను కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ముబిన్ ఉపయోగించిన కారులో రెండు సిలిండర్లలో ఒకటి పేలిందని పోలీసులు గుర్తించారు.పేలుడకు గురైన కారులో మేకులు, గోళీలు, ఇతర వస్తువులు లభించాయని పోరెన్సిక్ అధికారులు తెలిపారు.ఆదివారం నాడు పేలుడు చోటు చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో 500 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు.