ఢిల్లీలో వాయు కాలుష్యం అరికట్టేందుకు ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు తీసుకోండి- సుప్రీంకోర్టు
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజల నుంచి నిఫుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని శాస్వతంగా అరికట్టడానికి ఏం చేయాలి అనే అంశంలో ప్రజల నుంచి నిపుణుల నుంచి సలహాలు స్వీకరించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ను సుప్రీం కోర్టు ప్యానెల్ గురువారం ఆదేశించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆ కమిషన్ తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. నగరంలో కొన్ని పరిశ్రమలపై నిషేధాన్ని ఎత్తివేయడంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ దాఖలు చేసిన అఫిడవిట్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఛీప్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ... ఢిల్లీలో కొద్ది రోజులుగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు. ఇది చాలా పేవలంగా ఉన్నప్పటికీ తాము తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత మెరుగుపడిందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నివారించే చర్యల్లో భాగంగా 40 ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయని ధర్మాసనానికి తెలిపారు. గతంలో పలు థర్మల్ పవర్ ప్లాంట్టు మూసివేశామని తెలిపారు. వాటిపై నిషేదం ఇప్పటికీ కొనసాగుతుందని వివరించారు. అయితే
విద్యుత్ మంత్రిత్వ శాఖతో చర్చించినట్టుగా మరిన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ మూసివేసే అవకాశం లేదని తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ విషయంలో చాలా రోజుల కిందట ఎన్ఈఈఆర్ఈ నిపుణులతో ఒక కమిటీ వేశామని తెలిపారు. ప్రతీ సారి వాయు కాలుష్యం వ్యాపించిన తరువాత చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో వాయు కాలుష్యాన్ని శాశ్వతంగా తగ్గించేందుకు ఒక నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
దేశ రాజధానిలో తీవ్ర వాయు కాలుష్యంపై ఢిల్లీలోని 17 ఏళ్ల విద్యార్థి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది. సుప్రీంకోర్టులో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు.
భారత్ లో వాయుకాలుష్యంపై SAFAR ఆందోళన..
ఇండియాలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై System of Air Quality and Weather Forecasting And Research (SAFAR) ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల్లో గాలిలో కాలుష్యం పెరిగిపోయిందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కొంత పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. ఢిల్లీలో గాలి కొంత మెరుగుపడినప్పటికీ అతి పేలవమైన జాబితాలోనే ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏక్యూఐ 377 ఉందని, రేపటి నుంచి గాలులు వీచే అవకాశం ఉండటం వల్ల కొంత మెరుగుపడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.
గత కొన్నేళ్ల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దేశ రాజధాని అన్ని రాష్ట్రాల కంటే విస్తీర్ణంలో తక్కువగా ఉండటం, పక్కనే పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతుల చర్యల వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతీ ఏటా రెండు రాష్ట్రాల రైతుల తమ పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఆ పొగమొత్తం ఢిల్లీని ముంచెత్తుతోంది. దీనికి తోడు అక్కడ ఉండే పరిశ్రమల పొగ కూడా వాయు కాలుష్యానికి కారణం అవుతోంది. ప్రతీ ఏటా ఈ వాయు కాలుష్యం వల్ల ఎందరో చనిపోతున్నారు. ప్రతీ ఏటా కొన్ని రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు.