వ్యవస్థ కాదు, మోడీ ప్రభుత్వం ఫెయిల్: కరోనా కట్టడిపై సోనియా గాంధీ
కరోనా పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ డిమాండ్ చేశారు. కరోనాను కట్టడి చేయడంలో మోడీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ: కరోనా పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ డిమాండ్ చేశారు. కరోనాను కట్టడి చేయడంలో మోడీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కరోనాను ఎదుర్కొనేందుకు జవాబుదారీతనం ఉండేలా స్టాండింగ్ కమిటీల సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
దేశంలో వనరులను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందని ఆమె ఆరోపించారు. ఇవాళ రాజకీయ నాయకత్వం వికలాంగురాలైందని ఆమె విమర్శించారు. ప్రజల పట్ల సానుభూతి లేదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడడంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆమె ఆరోపించారు. కరోనా కట్టడిలో వ్యవస్థ విఫలం కాలేదని, మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు.
మహహ్మారిని ఎదుర్కొనేందుకు జవాబుదారీతనంతో పని చేసే స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 2020 అక్టోబర్ మాసంలో ఆరోగ్యంపై స్టాండింగ్ కమిటీ నివేదికను అధికారుల దృష్టికి తీసుకురావాలని రాజ్యసభ లో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రశాంతమైన దూరదృష్టి గల నాయకత్వం అవసరమని ఆమె చెప్పారు.
మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్ధత కారణంగా దేశం మునిగిపోతోందని ఎంపీల సమావేశంలో విమర్శించారు. అసాదారణ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరుగుతుందని సోనియా చెప్పారు. దేశం ఆరోగ్య విపత్తును ఎదుర్కొంటుందున్నారు. ప్రభుత్వ టీకా విధానం సరిగా లేదని సోనియా విమర్శించారు. లక్షలాది మంది దళితులు, ఆదీవాసీలు వెనుకబడినతరగుతలతో పాటు పేదలు వ్యాక్సిన్ వేసుకోలేకపోయారన్నారు. మోడీ ప్రభుత్వం తన నైతిక బాధ్యత నుండి తప్పుకోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు.