కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు భూములను కోల్పోతారనే భయాన్ని విపక్షాలు సృష్టిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. రాజకీయ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు భూములను కోల్పోతారనే భయాన్ని విపక్షాలు సృష్టిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. రాజకీయ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.
మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం నాడు మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టం అంశం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందని ఆయన గుర్తు చేశారు. స్వామినాథన్ రిపోర్టును కాంగ్రెస్ పార్టీ తగులబెట్టిందని ఆయన విమర్శించారు.
కొత్త వ్యవసాయ చట్టాలను కొన్నేళ్లుగా రైతులు కోరుతున్నారని ఆయన చెప్పారు. భారతీయ రైతులు తాజా టెక్నాలజీని పొందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఇవాళ అనేకమంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని ఆయన చెప్పారు. గతంలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటులో లేవన్నారు. దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చేలా నిబంధనలను మార్చినట్టుగా ఆయన తెలిపారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు 8 ఏళ్లుగా నిలిపివేసినట్టుగా ఆయన చెప్పారు.
పీఎం కిసాన్ పథకం సుమారు ఏటా రూ. 75 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రూ. 7 లక్షల కోట్లు 10 ఏళ్లలో రైతులకు అందుతోందన్నారు.
దేశంలో యూరియా కొరత లేదన్నారు. రైతుల బాధలను తీర్చేందుకు నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకొంటున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.
గత ఏడేనిమిదేళ్ల క్రితం యూరియా పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో పప్పుధాన్యాల సంక్షోభం ఎలా ఉందో 2014 ను గుర్తు చేసుకోవాలని ఆయన రైతులను కోరారు.
ఎక్కడ తన పంటకు ఎక్కువ ధర లభిస్తోందో రైతు అక్కడ తన ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ కొత్త చట్టం వెసులుబాటు కల్పిస్తోందని ఆయన చెప్పారు.
కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ఒక్క మార్కెట్ కూడా మూసివేయలేదన్నారు. వ్యవసాయ ఒప్పందం పంటలను లేదా ఉత్పత్తిని మాత్రమే రాజీ చేస్తోందన్నారు. భూమి రైతుతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 25వ తేదీన అటల్ జీ పుట్టిన రోజును పురస్కరించుకొని పిఎం కిసాన్ సమ్మన్ ఫండ్ మరో విడత ఒకేసారి కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయనున్నట్టుగా చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 18, 2020, 3:18 PM IST