Shrikant Tyagi Case: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన త్యాగి .. సంచలన విషయాలు వెలుగులోకి ..
Shrikant Tyagi Case: ఢిల్లీలోని నోయిడా హౌసింగ్ సోసైటీలో మహిళపై దాడి,దూషించిన కేసులో పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మంగళవారం మీరట్లో అరెస్టు చేశారు. సిద్ధాపురి కాలనీలో తన సన్నిహిత మిత్రునితో కలసి దాక్కున్న త్యాగిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
Shrikant Tyagi Case: ఢిల్లీలోని నోయిడా హౌసింగ్ సోసైటీలో మహిళపై దాడి, దూషించిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు శ్రీకాంత్ త్యాగిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్ననిందితుడు త్యాగి సోమవారం రాత్రి హరిద్వార్ మీదుగా షహరాన్పూర్ చేరుకున్నారు. అక్కడ నుంచి రిషికేష్ చేరుకున్నారు. ఇక మంగళవారం ఉదయం మీరట్ వచ్చారు. ఈ తరుణంలో నొయిడా పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అతడిని అదుపు లోకి తీసుకున్నారు. నోయిడా హౌసింగ్ సోసైట్లో ఆక్రమణలను ప్రశ్నించిన మహిళపై దాడికి పాల్పడిన త్యాగి. గత నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్న రౌడీ లీడర్ను ఎట్టకేలకు అదుపు లోకి తీసుకున్నారు
ఈ సందర్భంగా కమీషనర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ.. నిందితుడు త్యాగి.. నోయిడా నుండి పారిపోయినప్పటి నుండి గత నాలుగు రోజుల వ్యవధిలో పులు ప్రాంతాలను తిరిగాయనీ, పోలీసులు గుర్తించకుండా ఉండటానికి వాహనాలు, మొబైల్ ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పరికరాలను మార్చేశాడని తెలిపారు. త్యాగిని పట్టుకునేందుకు తొలుత ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, అయితే... ఆ తర్వాత మరో నాలుగు బృందాలను అదనంగా ఏర్పాటు చేర్చామని కమిషనర్ తెలిపారు.
నిందితుడు త్యాగి తప్పించుకోవడానికి యుపి సరిహద్దుల వెలుపల కూడా వెళ్ళాడనీ, కానీ పోలీసు బృందాలు కాల్ డిటేల్స్ ఆధారం అతనిని ట్రాక్ చేశామని తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు చాకచక్యంగా వ్యవహరించాడనీ, ట్రాక్ నుండి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు రేడియో, ఎలక్ట్రానిక్ ప్రిక్వేన్సిలను ఉపయోగించాడనీ, అయినా.. పోలీసులు తమ ప్రయత్నాలను కొనసాగించారనీ, చివరికి మంగళవారం నాడు నోయిడా పోలీసులు.. మీరట్ లో ఇతర సహాయక బృందాలతో సహాయంతో అతనిని అరెస్టు చేశారని అన్నారాయన. ఇప్పటికే నిందితుడు త్యాగి.. భారతీయ శిక్షాస్మృతి, గ్యాంగ్స్టర్స్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారని కమీషనర్ తెలిపారు.
విచారణలో నిందితుడు శ్రీకాంత్ త్యాగి సంచలన విషయాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. తన కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ను సమాజ్వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య ఇచ్చినట్టు తెలిపారు. నోయిడా లోని త్యాగి నివాసం రెండు టయోటా ఫార్చ్యూనర్, రెండు టాటా సఫారీ, హోండా సివిక్ అనే ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ అలోక్ సింగ్ తెలిపారు. నిందితుడు త్యాగి మౌర్యకు సహచరుడిగా పనిచేశారని పోలీసు కమిషనర్ తెలిపారు.
గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మౌర్య ఈ ఏడాది ప్రారంభంలో అసెంబ్లీకి ముందు పార్టీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ నుంచి రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరోవైపు.. నిందితుడు త్యాగి.. తాను బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడనీ, యువ సమితి జాతీయ కో-ఆర్డినేటర్ అని చెప్పుకుంటూ.. పలు దారుణాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అధికార బీజేపీ మాత్రం అతనితో ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. మరో వైపు.. ఆప్ ఈ అంశంపై దాడి చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డాతో సహా సీనియర్ కాషాయ పార్టీ నాయకులతో త్యాగి దిగిన చిత్రాలను పంచుకుంటూ.. విమర్శాస్త్రాలను సంధించింది.