కర్ణాటక హిజాబ్ ఆర్డర్పై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ
హిజాబ్ వివాదం: ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ మార్చి 15న ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 5 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించింది. ఇది కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర నగరాల్లో భారీ నిరసనలు-ప్రతిఘటనలకు దారితీసింది.
సుప్రీంకోర్టు: ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో అవసరమైన మతపరమైన ఆచారంలో భాగం కాదని మార్చి 15న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ వివాదంపై పిటిషన్లు దాఖలు అయిన ఐదు నెలల తర్వాత మొదటి విచారణకు రానుంది. కొత్త భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉదయ్ ఉమేష్ లలిత్ మొదటి పని రోజున విచారణకు ఈ పిటిషన్లు జాబితా చేయబడ్డాయి. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం మార్చి నుండి ప్రాథమిక విచారణకు కూడా విఫలమైన పిటిషన్లను పరిశీలిస్తుంది.
ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ మార్చి 15న ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 5 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించింది. ఇది కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర నగరాల్లో భారీ నిరసనలు-ప్రతిఘటనలకు దారితీసింది. ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి నేతృత్వంలోని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఖురాన్ ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేయలేదనీ, "ఎక్కువగా బహిరంగ ప్రదేశాలకు ప్రవేశం పొందేందుకు ఈ వస్త్రధారణ ఒక సాధనం, సామాజిక భద్రత ప్రమాణం, కానీ మతపరమైన ముగింపు కాదని పేర్కొంది. కాగా, రాజ్యాంగం ప్రకారం హిజాబ్ ధరించడం తమ మతపరమైన హక్కుగా పరిరక్షించబడుతుందంటూ కొందరు బాలికలు, విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు, కర్ణాటక విద్యా చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో యూనిఫాంను సూచించే రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని సమర్థించింది. విద్యార్థులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి అని పేర్కొంది.
ఈ క్రమంలోనే పలువురు కర్నాటక హైకోర్డు హిజాబ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మరో పిటిషనర్ అయిన ఐషత్ షిఫా కూడా హైకోర్టు తీర్పు వెలువరించిన ఒక రోజు తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. హిజాబ్ ధరించాలని కోరుతూ అసలు నిరసనలకు కేంద్రమైన ఉడిపిలోని పీయూ కళాశాల విద్యార్థులు వేసిన పిటిషన్ను మార్చి 16న అత్యవసర విచారణ కోసం కామత్ ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ను పరిశీలిస్తామని కోర్టు చెప్పినప్పటికీ కేసులను విచారణకు రాలేదు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు మార్చి-జూలై మధ్యకాలంలో కేసులను జాబితా చేయాలని మాజీ సీజేఐ ఎన్వీ రమణను పలుమార్లు అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది.
హిజాబ్ వివాదం..
ఉడిపిలోని ఒక పాఠశాలలో విద్యార్థులు హిజాబ్ లు ధరించి తరగతులకు హాజరుకావడంపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారి తీరును వ్యతిరేకిస్తూ.. కాషాయ కండువాలు ధరించారు. ఈ క్రమంలోనే హిజాబ్-కాషాయ కండువాల వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే కాషాయ కండువాలు, హిజాబ్ లు ధరించి పాఠశాలకు రావద్దని యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితే, దీనిపై హిజాబ్ ధరించిన బాలికలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు సైతం యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొద్ది రోజుల్లోనే ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. ఈ క్రమంలోనే హిజాబ్ ధరించిన బాలికలు కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం వారి వాదనలు తోసిపుచ్చింది. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. దీంతో పలువురు హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.