రాజకీయ పార్టీల మద్ధతుదారులకే ఈసీ, సీఈసీ పోస్టులు.. సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల కమీషనర్ల నియామకం విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమీషన్ సభ్యుల్లో వుండాలని సుప్రీం అభిప్రాయపడింది.
ఎన్నికల కమీషనర్ల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ తమకు అనుకూలంగా వుండే వ్యక్తిని.. సీఈసీగా నియమిస్తోందంటూ సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా వుండాలని సూచించింది. ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐనీ చేర్చాలని సుప్రీం ఆదేశించింది. సీఈసీ, ఈసీల నియామకానికి కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమీషన్ స్వతంత్రంగా పనిచేయాలని... ప్రధానిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమీషన్ సభ్యుల్లో వుండాలని సుప్రీం అభిప్రాయపడింది. అనంతరం ఎన్నికల కమీషనర్ల పిటిషన్పై విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.