విడాకులకు సంబంధించి సుప్రీం కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. ‘‘వివాహం కోలుకోలేని విచ్ఛిన్నం’’ అనే కారణంతో వివాహాలను రద్దు చేయవచ్చని జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

న్యూఢిల్లీ: విడాకులకు సంబంధించి సుప్రీం కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. ‘‘వివాహం కోలుకోలేని విచ్ఛిన్నం’’ అనే కారణంతో వివాహాలను రద్దు చేయవచ్చని జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. విడాకుల కోసం 6 నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దంపతుల పరస్పర సమ్మతి ఉంటే విడాకుల మంజూరు చేయవచ్చని తెలిపింది. 

షరతులకు లోబడి పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఆరు నెలల తప్పనిసరి నిరీక్షణ వ్యవధిని రద్దు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘వివాహం కోలుకోలేని విచ్ఛిన్నం ఎప్పుడు జరుగుతుందో నిర్ణయించగల అంశాలను కూడా మేము నిర్దేశించాము’’ అని కూడా ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు కోరుతూ శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ పేరుతో 2014లో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.