మీడియాపై ఈసీ పిటిషన్: కొట్టివేసిన సుప్రీం
జడ్జిల వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా మీడియాను నియంత్రించాలని ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం నాడు కొట్టివేసింది
న్యూఢిల్లీ: జడ్జిల వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా మీడియాను నియంత్రించాలని ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం నాడు కొట్టివేసింది. మీడియాపై ఫిర్యాదు చేసి వాటికి సంకెళ్లు వేయాలని రాజ్యాంగసంస్థలు కోరకూడదని సుప్రీం అభిప్రాయపడింది. అయితే రాజ్యాంగ సంస్థలు ఉన్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్న అంశాల్లో న్యాయస్థానాలు కొంత నిగ్రహం పాటిస్తూ సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. కరోనా కేసుల పెరుగుదలకు ఈసీదే బాధ్యత అని మద్రాస్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఈ రకంగా వ్యవహరించిన ఈసీపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని వ్యాఖ్యానించింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.