Asianet News TeluguAsianet News Telugu

రాజీవ్ గాంధీ హత్య కేసులో మిగిలిన ఆరుగురు దోషులను విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. 

Supreme Court orders to releases Rajiv Gandhi assassination case all convicts
Author
First Published Nov 11, 2022, 1:36 PM IST

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీతో పాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వీరి విషయంలో కూడా వర్తిస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నలతోధర్మాసనం పేర్కొంది. సుప్రీం ఆదేశాలతో రాజీవ్ హత్య కేసులో దోషులైన నళిని, ఆమె భర్త మురుగన్ అలియాస్ శ్రీహరన్, సంతన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయస్‌లకు భారీ ఊరట లభించింది. ఇక, ఈ కేసులో దోషులు తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ సుదీర్ఘ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ, రవిచంద్రన్, సంతన్, మురుగన్, ఏజీ పెరరివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్‌లకు జీవిత ఖైదు విధించబడింది. అయితే ఈ ఏడాది మే18న రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాన్ని ప్రయోగిస్తూ.. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పెరరివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇక, రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల వయసులో పెరరివాలన్ అరెస్టయ్యాడు. 1998లో పేరారివాలన్‌కు Anti-Terrorism Court మరణశిక్ష విధించింది. మరుసటి ఏడాది సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన బెల్ట్ బాంబును ప్రేరేపించడానికి ఉపయోగించిన 8-వోల్ట్ బ్యాటరీని కొనుగోలు చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. 

2001లో నళినీ శ్రీహరన్‌కు ఒక కుమార్తె ఉన్నందున ఆమె మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 2014లో పెరరివాన్, మరో ఇద్దరు మురుగన్, సంతన్  (ఇద్దరూ శ్రీలంక వాసులు) క్షమాభిక్ష పిటిషన్‌లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్నందున దోషుల మరణశిక్షను.. జీవిత ఖైదుగా మార్చారు. 

ఇక, తమిళనాడు ప్రభుత్వం 2018లో ఈ కేసులో పెరారివాలన్‌తో పాటు మరో ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే వాటిని గవర్నర్.. రాష్ట్రపతికి ఫార్వర్డ్ చేశారు. ఇక, పెరరివాలన్‌‌కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మేలో పెరరివాలన్‌ విడుదల చేయాలని ఆదేశించింది.  ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఇప్పటి వరకు నళిని, రవిచంద్రన్ ఇద్దరూ పెరోల్‌పై ఉన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios