జనాభా నియంత్రణ చట్టంపై కేంద్రానికి నోటీసు జారీ చేసిన సుప్రీం..
జనాభా నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ పై సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఆ చట్టంపై వివరణ ఇవ్వాలని కోరింది. పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పించలేక, ఆహారం, నీరు వంటి కనీస అవసరాలను కూడా ప్రభుత్వం తీర్చలేకపోతున్నదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆవశ్యక అవసరాలను తీర్చడానికి జనాభా నియంత్రణ చట్టంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిటిషన్ దారులు కోరారు.
దేశంలో జనాభా నియంత్రణకు సంబంధించి చట్టం చేయాలనే డిమాండ్ మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. స్వామి జితేంద్రానంద సరస్వతి ఈ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. జితేంద్రానంద సరస్వతి పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది.
స్వామి జితేంద్రానంద సరస్వతి దాఖలు చేసిన తన పిటిషన్లో జనాభా నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా భారతదేశంలోని సగం సమస్యలకు కారణమని ఆయన అన్నారు. ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పించలేకపోతోందని, ఆహారం, నీరు వంటి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నదని పేర్కొన్నారు.
ఈ ఆవశ్యక అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. జనాభా నియంత్రణ చట్ట రూపకల్పన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. జనాభా నియంత్రణ చట్టాన్ని సత్వరమే తీసుకురాకపోతే దేశం విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉందని, జనాభా తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందని, స్వచ్ఛమైన నీరు, ఆహారం, స్వచ్ఛమైన వాతావరణం కూడా అందుబాటులోకి వస్తుందన్నారని స్వామి జితేంద్రానంద సరస్వతి పేర్కొన్నారు.
అంతకుముందు జూన్ 15న.. దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, అలాగే.. మార్గదర్శకాలను జారీ చేయాలని మధురకు చెందిన వ్యాఖ్యాత, ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పటిష్టమైన జనాభా నియంత్రణ చట్టాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్లో కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19, 21 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జనాభా చట్టం చేయాల్సిన అవసరం ఉందని,ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని పిల్లో పేర్కొన్నారు.
స్వామి దేవకినందన్ ఠాకూర్ దాఖలు చేసిన పిల్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జనాభాను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి చెందిన దేశాల జనాభా నియంత్రణ చట్టాలు, విధానాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు లా కమిషన్ను ఆదేశించవచ్చని దేవకీనందన్ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే.. పెరుగుతున్న జనాభా ప్రభావం మహిళలపైనే ఎక్కువగా ఉందని దేవకీనందన్ ఠాకూర్ అన్నారు. ఎందుకంటే మళ్లీ మళ్లీ పిల్లలను కనాలని వారిపై ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు.