హిజాబ్ పై నిషేధం.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
హిజాబ్ నిషేధం కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇకపై సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
కర్నాటక లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కొంత మంది ముస్లిం పిటిషన్లను కర్నాటక హైకోర్టు ఆశ్రయించగా.. ఫలితంగా లేకుండా పోయింది. హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో పిటిషన్ దారులు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు. పాఠశాలలు, కళాశాలల్లో దుస్తుల నిబంధనలను కఠినంగా అమలు చేయాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. వివిధ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల మత విశ్వాసాన్ని పాటించకుండా అడ్డుకున్నారని, దీనివల్ల అవాంఛిత శాంతిభద్రతల పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ.. ముస్లిం విద్యార్థులపై సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని సుప్రీం కోర్టుకు చేసిన అప్పీళ్లలో ఒకరూ ఆరోపించారు.
దీంతో హిజాబ్ అంశంపై ఇవాళ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ హేమంత గుప్తా, సుధాన్షు దులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. హిజాబ్ బ్యాన్ ఎత్తివేత అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. కర్నాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మళ్లీ సెప్టెంబర్ 5వ తేదీన విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.
క్లాస్రూమ్లో హిజాబ్ ధరించే అనుమతి ఇవ్వాలని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీ ముస్లిం అమ్మాయిలు కర్నాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను హై కోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.
హిజాబ్ వివాదం ఎప్పుడు ప్రారంభమైందంటే..
ఈ ఏడాది ప్రారంభంలో ఉడిపిలోని ప్రభుత్వ పాఠశాలలో కొంత మంది బాలికలు తరగతిలో హిజాబ్ ధరించకుండా నిషేధించడంతో కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైంది. దీనిపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాగా, ఫిబ్రవరి 8న మండ్యలోని పీఈఎస్ కళాశాలలో కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి.. జయశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత వివాదం ముదిరింది. ఆ తరువాత ఈ విషయం కర్ణాటక హైకోర్టుకు చేరుకుంది, హిజాబ్ ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి.. విద్యాసంస్థల్లో యాజమాన్యం ఆమోదించిన యూనిఫాంను ధరించాలని సూచించింది.