Asianet News TeluguAsianet News Telugu

విప్లవ కవి వరవరరావుకు బెయిల్: సుప్రీంకోర్టు షరతులు ఇవీ

Elgar Parishad: 2017 డిసెంబరు 31న పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌నీ, భీమా కోరేగావ్ లో హింస‌కు కార‌ణ‌మ‌య్యార‌నే ఆరోప‌ణ‌ల‌తో వ‌ర‌వ‌ర‌రావుపై కేసు నమోదైంది.
 

Supreme Court granted bail to social activist and poet Varavara Rao
Author
Hyderabad, First Published Aug 10, 2022, 2:59 PM IST

Bhima Koregaon violence: భీమా కోరేగావ్ హింసాకాండలో నిందితుడిగా ఉన్న 82 ఏళ్ల తెలుగు కవి, సామాజిక కార్య‌క‌ర్త పి.వరవరరావు రెండు సంవత్సరాలకు పైగా కస్టడీలో ఉన్నందున.. ప్రస్తుత అతని ఆరోగ్య ప‌రిస్థితి, పైబ‌డిన వయస్సును దృష్టిలో ఉంచుకుని బెయిల్‌పై బయట ఉండటానికి సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. భీమా కోరేగావ్ కేసులో నిందితుడైన కార్యకర్త వరవరరావుకు వైద్య కారణాలతో సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన స్వేచ్ఛను ఏ విధంగానూ దుర్వినియోగం చేయరాదని పేర్కొంది.

వ‌ర‌వ‌ర‌రావును బొంబాయి హైకోర్టు ఫిబ్రవరి 22, 2021న ఆరు నెలల కాలానికి మెడికల్ బెయిల్‌పై విడుదల చేసింది. జూలై 12లోగా లొంగిపోవాలని కోరుతూ హైకోర్టు ఏప్రిల్ 13న మరో మూడు నెలల పాటు పొడిగించింది. అయితే, ఆయన లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు కాల వ్యవధిని ఎప్పటికప్పుడు పొడిగించింది. ఆయ‌న‌కు మంజూరైన బెయిల్‌ను శాశ్వతం చేయాలంటూ రావు చేసిన అప్పీల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ విషయాన్ని బుధవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తులు యూయూ లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధూలియాతో కూడిన ధర్మాసనం..  "ఇదివ‌ర‌కు కొన‌సాగిన పరిస్థితుల మొత్తం పరిగణనలోకి తీసుకుంటే, అప్పీలుదారుకు వైద్యపరమైన కారణాలపై బెయిల్ నుండి ఉపశమనం పొందే అర్హత ఉందని మా అభిప్రాయం" అని పేర్కొంది.

వ‌ర‌వ‌ర‌రావుకు 82 ఏళ్లు పైబడిన వయసు కావడం కోర్టు ప్రాధాన్యతనిచ్చింది. రెండు కళ్లలో శుక్లాలు రావడం, బొడ్డు హెర్నియా ఆపరేషన్ చేయించుకోవడం, పార్కిన్‌సోనియన్ లక్షణాలు కనిపించడం వంటి కారణాలతో అతని పరిస్థితి మరింత క్షీణించిందని రావు న్యాయవాది ఆనంద్ గ్రోవర్, న్యాయవాది నూపుర్ కుమార్‌లు కోర్టుకు తెలిపారు. బెయిల్‌పై షరతులు విధిస్తూ, విచారణ జరుగుతున్న గ్రేటర్ ముంబై అధికార పరిధిని విడిచిపెట్టడానికి రావును అనుమతించబోమని ధర్మాసనం ఆదేశించింది. " అప్పీలెంట్ తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు లేదా సాక్షులతో సన్నిహితంగా ఉండకూడదు లేదా విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదు" అని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేశారు. పిటిషనర్ చేపట్టే ఏదైనా వైద్య చికిత్సకు సంబంధించిన విష‌యాల‌ను ఎన్ఐఎకు తెలియజేయాలని కూడా ధ‌ర్మాసనం ఆదేశించింది. బెయిల్ ప్రయోజనం అతని వైద్య పరిస్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుందని ధ‌ర్మాసనం స్పష్టం చేసింది. 

ఈ ఉత్తర్వును కేసు మెరిట్‌లపై కోర్టు తీసుకున్న ఎలాంటి అభిప్రాయంగా చూడకూడదని స్పష్టం చేసింది. ఈ వారం ప్రారంభంలో అఫిడవిట్ దాఖలు చేసిన NIA, రావు నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైనందున, అతను దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారంతో కూడిన తీవ్రమైన నేరంలో పాల్గొన్నాడని పేర్కొంటూ బెయిల్‌ను వ్యతిరేకించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టడానికి, రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి భద్రతా దళాలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పాల్పడుతోందని ఆరోపించింది. జనవరి 2018లో జరిగిన భీమా కోరేగావ్ హింసపై రావు విచారణను ఎదుర్కొంటున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం-1967, భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర నిబంధనల ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడ్డార‌నే ఆరోప‌ణ‌ల కింద కేసు న‌మోదుచేశారు. వ‌ర‌వ‌ర‌రావు ఆగస్టు 2018 లో ఈ కేసులో అరెస్టయ్యాడు. నవంబర్ 2018 వరకు గృహనిర్బంధంలో ఉన్నారు. రెండున్నరేళ్లకు పైగా తలోజా జైలులో ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios