నేను విచారించను: కృష్ణా నదీ జలాల వివాదం కేసుపై సుప్రీం సిజె రమణ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా నదీ జలాల వివాదం కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పారు. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదం కేసు విచారణకు తాను దూరంగా ఉంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నడుస్తున్న ఈ కేసు విచారణ తాను చేపట్టబోనని ఆయన చెప్పారు. తాను రెండు రాష్ట్రాలకు చెందినవాడినని, అందువల్ల ఆ కేసు విచారణకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు.
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన ఉభయ రాష్ట్రాలకు సూచించారు తాను రెండు రాష్ట్రాలకు చెందినవాడిన కాబట్టి ఈ కేసును తాను వినబోనని ఆయన చెప్పారు. సమస్య మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అవుతుందనుకుంటే ఆ మార్గంలో నడవాలని ఆయన సూచించారు. లేదంటే తాను కేసు మరో బెంచ్ కు బదిలీ చేస్తానని చెప్పారు.
కృష్ణా నదీ జలాలపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మీరు ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశంగా ఆలోచించాలని, అనవసరంగా తాము జోక్యం చేసుకోబోమని ఆయన చెప్పారు. కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం విచక్షణారహితంగా కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇది 2015నాటి ఒప్పందానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ మూడు ప్రాజెక్టుల నీటిని తెలంగాణ విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల తమకు నష్టం జరుగుతోందని ఏపీ వాదిస్తోంది.