అరేబియా సముద్రంలో మునిగిన కార్గో షిప్ నుంచి లీక్ అయిన ఆయిల్ తొలగింపుతోపాటు, పేలుడు ముప్పుతో అధికారులు సున్నితంగా స్పందిస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఆదివారం మునిగిపోయిన ఓ భారీ కార్గో షిప్ నుండి లీక్ అయిన ఆయిల్ను సముద్రం నుండి తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఈ షిప్ మొత్తం 640 కంటైనర్లతో ప్రయాణించగా, ఇది కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ళ దూరంలో మునిగిపోయింది. దీంతో నావికా సిబ్బంది అప్రమత్తమై, కోస్ట్ గార్డ్ కు చెందిన రెండు షిప్స్, డోర్నియర్ విమానాలతో ఆయిల్ స్పిల్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ షిప్ లో ఉన్న కొన్ని కంటైనర్లు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా 250 టన్నుల కాల్షియం కార్బైడ్ ఉన్న కంటైనర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రసాయనం నీటితో కలిసినప్పుడు ఎసిటిలీన్ అనే వాయువు విడుదల అవుతుంది. అది పెద్ద పేలుడుకు దారితీయవచ్చనే అనుమానంతో అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే షిప్ నుండి పడిపోయిన కొన్ని కంటైనర్లు సముద్రంలో తేలుతుండగా, వాటిలో ఒకటి కొల్లం జిల్లాలోని కరునాగపల్లి సమీపంలోని తీరానికి తాకింది. ఇది అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దంతో ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే దీనిపై అధికారులకు సమాచారం అందించారు. వారి పరిశీలనలో ఆ కంటైనర్ ఖాళీగా ఉందని తేలింది.
ప్రస్తుతం ఆయిల్ లీక్ వల్ల సముద్ర జీవ వ్యవస్థపై ప్రభావం పడకుండా ఉండేందుకు శుద్ధి చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఇతర ప్రమాదకర కంటైనర్ల గమ్యం గుర్తించి అవి పేలే ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.