కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి తన పరిధిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగింది. జూన్ 7 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. 

మే నెల ముగిసి జూన్‌లోకి ప్రవేశించినా దేశంలో ఇంకా ఎండలు మండుతూనే వున్నాయి. ఉదయం 9 గంటలకు భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో గడప దాటాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, జ్యూస్‌లను ఆశ్రయిస్తున్నారు. జూన్ నెలలోనూ ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జనం ఇంకా బేంబేలెత్తిపోతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు.. త్వరలో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు, విద్యా సంస్థలు తెరచుకోనున్నాయి. అయితే ఎండలు మండిపోతుండటంతో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు సెలవులను పొడిగించాలని చూస్తున్నాయి. దీనిలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సైతం తన పరిధిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి అన్ని స్కూల్స్ పున: ప్రారంభం కావాల్సి వుండగా ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో సెలవులను పొడిగించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 

దీంతో జూన్ 7 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. దీనితో పాటు పుదుచ్చేరిలో వున్న 127 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు అనుమతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్ధులకు ఉచిత యూనిఫాం, సైకిళ్ల పంపిణీ పూర్తయ్యిందన్నారు.