ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో ఆర్మీ, తిరుగుబాటుదారుల పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో ఆర్మీ, తిరుగుబాటుదారుల పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్దం వల్ల దెబ్బతిన్న సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ దేశంలోని సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్ చేరుకున్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఏఎఫ్‌ విమానాల ద్వారా వారిని భారత్‌కు తరలించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు ఆపరేషన్ కావేరి అని పేరు పెట్టారు. 

‘‘సుడాన్‌లో చిక్కుకుపోయిన మన పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ జరుగుతోంది. సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారు. మరికొంతమంది వారి దారిలో ఉన్నారు. మన నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. సూడాన్‌లోని మన సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం’’ జైశంకర్ ట్వీట్ చేశారు. 

 

Scroll to load tweet…


భారతీయులను తరలించేందుకు రెండు సీ-130 విమానాలు, నౌకాదళ నౌక ఐఎన్ ఎస్ సుమేధ సిద్ధంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. సుడాన్ నుంచి భారత జాతీయులను తరలించడానికి వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, ఐఎన్‌ఎస్ సుమేధ పోర్ట్ సుడాన్‌కు చేరుకుందని భారతదేశం ఆదివారం ప్రకటించింది.

ఇక, వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఇందులో సౌదీ అరేబియాకు చెందినవారు కాకుండా.. భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. సౌదీ అరేబియా తరలించిన ముగ్గురు భారతీయులు ఉండగా.. వారు సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్‌లోని సిబ్బందిగా పనిచేస్తున్నారు. మరోవైపు భారతీయ పౌరులతో సహా 28 దేశాలకు చెందిన 388 మందిని ఫ్రాన్స్ తరలించింది.