కర్ణాటక పాఠశాలలో నమాజు వివాదం.. మండిపడ్డ హిందూ సంఘాలు
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ తాలుకా శంకరనారాయణ పట్టణంలో మదర్ థెరిసా మెమొరియల్ స్కూల్లో విద్యార్ధుల చేత నమాజు చేయించడం వివాదాస్పదమైంది.
ఇటీవల హిజాబ్ వ్యవహారం కర్ణాటకతో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోనే మరో వివాదం రాజుకుంది. ఉడుపి జిల్లా కుందాపూర్ తాలుకా శంకరనారాయణ పట్టణంలో మదర్ థెరిసా మెమొరియల్ స్కూల్లో సోమవారం ఆటల పోటీల జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అజాన్ను లౌడ్ స్పీకర్లో వినిపించి.. విద్యార్ధుల చేత నమాజ్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. పాఠశాల వద్ద ధర్నా నిర్వహించాయి. దీనిపై అన్ని వైపులా విమర్శలు రావడంతో పాఠశాల యాజమాన్యం స్పందించింది. అజాన్ వినిపించడం తప్పేనని అంగీకరిస్తూ.. క్షమాపణలు చెప్పింది. ఒక టీచర్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సామరస్యాలు, సమానత్వం కోసం ప్రార్థన చేయించినట్లు వెల్లడించారు.