ఫీజు చెల్లించలేక.. విద్యార్థిని ఆత్మహత్య
ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఫీజు రూ.40 వేలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్ను ఆదేశించింది. షకీల్ డబ్బు సర్దుబాటు చేయలేకపోయాడు
ఆర్థిక పరిస్థితులు సహకరించక ఓ విద్యార్థిని తనువు చాలించింది. ఉన్నత విద్యను అభ్యసించాలన్న కోరికకు.. తన ఆర్థిక పరిస్థితి అడ్డుగా మారడంతో.. ఆమె తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా కాలం కావడంతో చేయడానికి పని దొరకక ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు చెల్లించే స్థోమత కూడా లేకుండాపోయింది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా షకీల్ ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి.
ఫీజు రూ.40 వేలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్ను ఆదేశించింది. షకీల్ డబ్బు సర్దుబాటు చేయలేకపోయాడు. తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆవేదనకు గురైన మెహెక్ ఇంట్లోనే ఉరి వేసుకుని మృత్యు ఒడికి చేరుకుంది. ఆమె తల్లి గృహిణి. 4, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి(19) ఇటీవల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.