ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ నిలిపివేయండి.. లెఫ్టినెంట్ గవర్నర్ కు సీఎం కేజ్రీవాల్ సిఫార్సు
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను నిలిపివేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సిఫార్సులు పంపించారు. ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సామర్థ్యంతో పని చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
ఢిల్లీలో (delhi) కోవిడ్ -19 (covid -19) నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూను (weekend curfew) నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కోరారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆయన సిఫార్సులు పంపించారు. రాష్ట్రంలో కోవిడ్ -19 పీక్ స్టేజ్ కు చేరుకుందని, క్రమంగా బలహీనపడుతోందని గురువారం హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ (satyendar jain) తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన ఒక రోజు తరువాత వీకెండ్ కర్ఫ్యూ ఆంక్షలు ఎత్తివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న సరి - బేసి విధానాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. అలాగే ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించాలని కోరారు. ఈ సిఫార్సులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపితే ఇకపై ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఉండదు. అలాగే ప్రస్తుతం ప్రైవేటు ఆఫీసులు కొనసాగిస్తున్న వర్క్ ఫ్రం హోం పద్దతిలో కొంత వెసులుబాటు వస్తుంది. మార్కెట్ లు కూడా పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంటుంది.
ఈ థర్డ్ వేవ్ (third wave) ప్రారంభమైన మొదట్లో దేశవ్యాప్తంగా ఢిల్లీలోనే అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్రలో అధికంగా కేసులు వెలుగులోకి వచ్చేవి. ఈ సమయంలో ఢిల్లీలో లాక్ డౌన్ (lock down) విధిస్తారని అందరూ భావించారు. కానీ దీనిపై గత వారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తే ఎందరో మంది శ్రామిక ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయని చెప్పారు. మరెందరో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటారని, ఉపాధి కోల్పొతారని చెప్పారు. కాబట్టి ఎప్పుటికీ లాక్ డౌన్ విధించబోమని అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే లాక్ డౌన్ విధిస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను ఒక్కోటిగా మెళ్లగా ఎత్తేస్తున్నారు. కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిపోతే ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర (maharatra) ప్రభుత్వం కూడా పలు ఆంక్షలను ఎత్తివేస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుమతి ఇచ్చారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు మూసివేసి ఉండటం వల్ల స్టూడెంట్లు ఎంతో నష్టపోతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయని, వెంటనే స్కూళ్లు ప్రారంభించాలని విద్యా శాఖ మంత్రి గైక్వాడ్ (gaikwad) చేసిన ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారు. అయితే స్కూళ్లు ప్రారంభించే విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం స్థానిక అధికారులకే వదిలేశారు. దీంతో స్థానికంగా ఉన్న కోవిడ్ -19 పరిస్థితులును బట్టి స్కూళ్లు తెరవాలా ? వద్దా ? అనే విషయం అక్కడి అధికారులు నిర్ణయించున్నారు.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 12,306 కొత్త కోవిడ్ -19 (covid-19) కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వల్ల మొత్తం 43 మంది చనిపోయారు. ఇవి గతేడాది జూన్ 10వ తేదీ నుంచి అత్యధిక మరణాలు. ఢిల్లీలో టెస్ట్ పాజిటివిటీ రేటు 21.48 శాతానికి పడిపోయింది.