భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ యాత్రపై కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వైరల్ !
Bharat Jodo Yatra: ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వంటి అంశాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైనప్పటి నుండి సంగనకల్లులో 40వ రోజుకు చేరుకోవడంతో విశ్రాంతి దినంగా పాటిస్తున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టారు. దీనికి ప్రజలను మంచి స్పందన లభిస్తోంది. అయితే, ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకరు భారత్ జోడో యాత్రపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను ఆపాలన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోయే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రావాలని అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడి పరిస్థితులను సరిదిద్దడానికి ఆయన రావాలని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. దక్షిణ గోవాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హా సోమవారం రాహుల్ గాంధీకి “భారత్ జోడో యాత్రను ఆపివేయండి” అని సలహా ఇచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలను జాగృతం చేస్తున్న ఆయన.. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాలని అన్నారు. అక్కడి వారిని జాగృతం చేయాలని పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆపి.. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లకు వెళ్లి ప్రజలను మేల్కొల్పాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా వారు బీజేపీని ఓడించగల ఏకైక పార్టీకి ఓటు వేయాలి. బీజేపీకి ప్రతిపక్షంగా ఉండగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే' అని సర్దిన్హా పేర్కొన్నట్టు ఏఎన్ఐ నివేదించింది.
కాగా, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విభజన, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైనప్పటి నుండి సంగనకల్లులో 40వ రోజుకు చేరుకోవడంతో విశ్రాంతి దినంగా పాటిస్తున్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 9,000 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. దాదాపు 22 ఏండ్ల తర్వాత మొదటి సారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షున్ని ఎన్నుకోవడానికి ఈ పోలింగ్ కొనసాగుతుండటం చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ 137 ఏళ్ల చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పలువురు తమ ఓటును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా ఓటు వేశారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ మీదుగా కర్ణాటక చేరుకుంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోకి భారత్ జోడో యాత్ర రానుంది. రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర క్యాంప్సైట్లో పార్టీ అధ్యక్ష పదవికి ఓటు వేశారు.