Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాలు ఏకరీతి పౌర స్మృతిపై చట్టాలు చేయవచ్చు.. : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

NEW DELHI : రాష్ట్రాలు ఏకరీతి పౌర స్మృతి (యూసీసీ) పై చట్టాలు చేయవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభకు తెలిపారు. ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు యూసీసీని అమలు చేయడానికి చర్యలు తీసుకున్నప్పటికీ వ్యక్తిగత చట్టాలు ఉమ్మడి జాబితాలోకి వస్తాయని న్యాయ మంత్రి చెప్పారు.
 

States can make laws on uniform civil code. : Union Law Minister Kiren Rijiju
Author
First Published Dec 16, 2022, 12:32 AM IST

Minister for Law and Justice Kiren Rijiju : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) సాధించే ప్రయత్నంలో వారసత్వం, వివాహం, విడాకులు వంటి సమస్యలను నిర్ణయించే వ్యక్తిగత చట్టాలను రూపొందించడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభకు తెలిపారు. యూసీసీకి సంబంధించి రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించడం గురించి కేంద్రానికి తెలుసా అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సభ్యుడు జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధాన‌మిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం భారత భూభాగం అంతటా పౌరులకు ఏకరీతి పౌరస్మృతి అమలు చేయడానికి రాష్ట్రం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే, "వ్యక్తిగత చట్టాలు, వారసత్వం, వీలునామా, ఉమ్మడి కుటుంబం-విభజన, వివాహం-విడాకులు, రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ జాబితా-3-సమకాలీన జాబితాలోని ఎంట్రీ 5 కు సంబంధించినవి కాబ‌ట్టి వాటిపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలకు కూడా అధికారం ఉందని తెలిపారు. 

యూసీసీ అమలు చేయాలనే తమ ఉద్దేశాన్ని అనేక భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో న్యాయ‌శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయ‌డం ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవకాశాలను అన్వేషించడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేసిన మొదటిది కాగా, గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ నెల ప్రారంభంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలా చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, యూసీసీ అమలును పార్టీ తన మేనిఫెస్టోలో భాగంగా చేసింది. ఈ నెల ప్రారంభంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో యూసీసీ అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

డిసెంబర్ 9 న బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా యూసీసీపై ప్ర‌యివేటు మెంబ‌ర్  బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు కోరడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వాయిస్ ఓటుకు పిలుపునిచ్చారు. బిల్లుకు అనుకూలంగా 63 మంది సభ్యులు ఓటు వేయగా, 23 మంది సభ్యులు వ్యతిరేకించారు. మీనాను సమర్థించిన రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్.. "రాజ్యాంగ నిర్దేశక సూత్రాల ప్రకారం ఒక సమస్యను లేవనెత్తడం సభ్యుడి చట్టబద్ధమైన హక్కు. ఈ విషయం గురించి చర్చించుకుందాం" అని అన్నారు. అంతకుముందు, ఈ సమస్యను పార్లమెంటులో లేవనెత్తినప్పుడు, లా కమిషన్ ఈ విషయాన్ని సవిస్తరంగా పరిశీలిస్తుందని న్యాయ మంత్రి చెప్పారు.

అలాగే, జడ్జీల నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి పరిమిత పాత్రనే ఉన్నదనే విషయాన్ని మరోసారి కిర‌ణ్ రిజిజు ప్రస్తావించారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తున్నదనీ అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్‌లో ఉండటంపై రాజ్యసభలో వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇది ఆందోళనకరమని అన్నారు. దీనికి ప్రాథమిక కారణంగా జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండటమే అని పేర్కొన్నారు. కేసుల పెండింగ్‌ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నదని తెలిపారు. కానీ, వాటిని నింపడంలో ప్రభుత్వానిది పరిమిత పాత్ర అని వివరించారు. కొలీజియం పేర్లు ఎంచుకుంటుందని, కేంద్ర ప్రభుత్వానికి ఇందులో ఏ హక్కూ లేదని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios