జమ్మూకశ్మీరులో ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ను మట్టుబెట్టిన బలగాలు
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు (Lashkar e Taiba) చెందిన టాప్ కమాండర్ సలీం పర్రేను (Salim Parray) పోలీసులు మట్టుబెట్టారు.
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు (Lashkar e Taiba) చెందిన టాప్ కమాండర్ సలీం పర్రేను (Salim Parray) పోలీసులు మట్టుబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ (Vijay Kumar) తెలిపారు. నగరంలోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో సలీమ్ పర్రేను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టుగా వెల్లడించారు. ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసు విభాగం ట్వీట్ చేసింది.
దీనిని ఇటీవలి రోజుల్లో ఉగ్రవాదంపై చర్యలో భద్రతా బలగాలు సాధించిన మరో పెద్ద విజయంగా చెప్పవచ్చు. డిసెంబర్ చివరి వారంలో అనంతనాగ్ జిల్లాలో (Anantnag district) జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా.. వారిలో ఒక్కరిని జైషే మహమ్మద్ (జేఈఎం) టాప్ టెర్రరిస్టు సమీర్ దార్గా (Samir Dar) పోలీసులు గుర్తించారు. 2019లో పుల్వామా టెర్రర్ అటాక్తో సంబంధం ఉన్న చివరి ఉగ్రవాది ఇతడేనని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ‘అనంత్నాగ్ ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరి ఫోటో.. లెత్పోరా, పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడిన చివరి ఉగ్రవాది అయిన జెఈఎం టాప్ కమాండర్ సమీర్ దార్తో మ్యాచ్ అవుతోంది. మేము DNA డీఎన్ఏ శాంపిల్ను టెస్ట్ చేయించబోతున్నాం’ అని తెలిపారు.
ఇక, గతేడాది అక్టోబర్లో కేంద్ర భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ఉమర్ ముస్తాఖ్ ఖాండేను పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.