పాకిస్థాన్ దుశ్చర్యలను ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని భారత్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే భారత రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తూనే పాకిస్థాన్ పై ఎదురుదాడికి దిగుతోంది.
India pakistan War : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో భారత ఆర్మీ కీలక చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలో సైన్యం ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీనగర్, పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ మిస్సైల్స్, డ్రోన్ ఎటాక్స్ కు ప్రయత్నిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్లోని కనీసం నాలుగు వైమానిక స్థావరాలను భారత దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని వర్గాలు తెలిపాయి. శనివారం 26 భారత ప్రాంతాలపై పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార దాడులు చేపట్టింది.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లోని డిబ్బర్ ప్రాంతంలో ఒక పెద్ద పేలుడు సంభవించిన తర్వాత పొగలు కమ్ముకున్నాయి. రాజౌరీ ప్రాంతంలో వరుస పేలుళ్ల కారణంగా ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, అఖ్నూర్లలో కూడా పెద్ద పేలుళ్లు వినిపించాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో.. “పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. వీటిలో ఆయుధాలు కలిగిన డ్రోన్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నాగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మెర్, భుజ్, క్వార్బెట్, లఖి నాలా వంటి ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. ఫిరోజ్పూర్లోని పౌర ప్రాంతాన్ని ఆయుధాలు కలిగిన డ్రోన్ లక్ష్యంగా చేసుకోవడంతో స్థానిక కుటుంబ సభ్యులు గాయపడ్డారు” అని తెలిపింది.
పాకిస్థార్ దాడులపై భారత సాయుధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి... వైమానిక ముప్పులన్నింటినీ ట్రాక్ చేసి కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించి ఎదుర్కొంటున్నాయి. ఆర్మీ ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లకూడదని, స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యంమని సైనిక అధికారులు సూచించారు.