SpiceJet flight: కాండ్లా నుంచి ముంబైకి వచ్చిన స్పైస్జెట్ విమానం వీల్ ఊడిపోయింది. దీంతో ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు.
SpiceJet flight: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (సెప్టెంబర్ 12, 2025న) పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గుజరాత్లోని కాండ్లా నుంచి ముంబైకి వస్తున్న స్పైస్జెట్ Q400 విమానం వీల్ తప్పిపోయిందని సమాచారం అందింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రన్వేపై బయటి వీల్ కనిపించడంతో ఈ సమస్య బయటపడింది.
ముంబై ఎయిర్పోర్ట్ అధికారుల అత్యవసర చర్యలు
వీల్ ఊడిపోయిందనే సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు అన్ని డిపార్చర్లు నిలిపివేశారు. అయితే, విమానం ముంబైలో సురక్షిత అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్లైన్ ప్రతినిధి ప్రకారం, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి గాయాలు జరగలేదు. ల్యాండింగ్ అనంతరం విమానం స్వయంగా టెర్మినల్ వరకు చేరుకుంది.
ప్రయాణికుల భద్రత
విమానంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అత్యవసర పరిస్థితులకై ఎయిర్పోర్ట్ సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదం తప్పింది.
స్పైస్జెట్లో సాంకేతిక లోపాలు.. 2025లో వరుస ఘటనలు
ఈ సంవత్సరం స్పైస్జెట్ విమానాల్లో అనేక సాంకేతిక సమస్యలు చోటుచేసుకున్నాయి.
• సెప్టెంబర్ 2025 – పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ తరువాత కొద్ది సేపటికే తిరిగి పుణెలో ఫుల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది.
• ఆగస్టు 2025 – ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానంలో కేబిన్ ప్రెజర్ సమస్య రావడంతో పైలట్ వెంటనే ల్యాండింగ్ కోరారు.
• మార్చి 2025 – జైపూర్ నుంచి చెన్నై వెళ్తున్న విమానం టేకాఫ్ తర్వాత రన్వేపై టైర్ ముక్క కనిపించడంతో కంట్రోల్ రూమ్ అప్రమత్తమైంది. ఆ తరువాత విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. అనంతరం టైర్లో ఒక పొర తెగిపోయిందని తెలిసింది.
ఈ ఘటనపై ఎయిర్లైన్, ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటువంటి సాంకేతిక లోపాలు తరచుగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. DGCA (Directorate General of Civil Aviation) ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరపుతోంది. ప్రయాణికుల భద్రత కోసం అన్ని సాంకేతిక తనిఖీలు మరింత కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
