మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్.. ఇద్దరు మంత్రులకు కోర్టు సమన్లు
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి షాక్ తగిలింది. నారదా కేసులో ఇద్దరు మంత్రులు విచారణకు హాజరవ్వాలని స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 16న కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో ఇద్దరు మంత్రులు మరో టీఎంసీ ఎమ్మెల్యే సహా కోల్కతా మాజీ మేయర్, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఓ ప్రత్యేక కోర్టు ఇద్దరు మంత్రులు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 16న కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. నారదా స్టింగ్ టేప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కింద చార్జిషీటు దాఖలు చేసింది. ఈడీ కంప్లైంట్ నేపథ్యంలో స్పెషల్ కోర్లు సమాన్లు పంపింది.
ఈ ఇద్దరు మంత్రులతోపాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్ర, కోల్కా మాజీ మేయర్ సోవన్ చటర్జీ, సస్పెండె అయిన ఐపీఎస్ అధికారి ఎస్ఎంహెచ్ మిర్జాలకూ సమన్లు పంపింది. ముఖర్జీ, హకీమ్, మిత్రాలు ఎమ్మెల్యేలు కాబట్టి వారికి సమన్లు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ గుండా చేరాలని కోర్టు సూచించింది. మిగిలిన ఇద్దరికీ కోర్టు నేరుగా సమన్లు పంపింది.
మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో ఈ నోటీసులు మంత్రులకు జారీ కావడం గమనార్హం. నారదా స్టింగ్ ఆపరేషన్ 2014లో నిర్వహించినప్పటికీ 2016 ఎన్నికలకు ముందు వీడియోలు చక్కర్లు కొట్టాయి. నారదా న్యూస్ పోర్టల్ సీఈవో మాథ్యూ శామ్యూల్ ఓ కంపెనీ(ఉనికిలో లేని కంపెనీ)కి ప్రతినిధిగా పేర్కొంటూ 12 మంది మంత్రులు, ఇతర టీఎంసీ నేతలు, ఐపీఎస్ అధికారితో రహస్యంగా భేటీ అయ్యారు. తమకు అనుకూలంగా వ్యవహరించాలని, అందుకోసం డబ్బులు పుచ్చుకుంటున్నట్టు ఆ స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. ఈ ఆపరేషన్ వీడియోలు అప్పుడు రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించాయి. అయినప్పటికీ 2016 ఎన్నికల్లో తృణమూల్ పార్టీనే మళ్లీ అధికారంలోకి రావడం గమనార్హం.