రాజ్యసభలో గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన విపక్ష సభ్యులపై చర్యలకు చైర్మన్ వెంకయ్య నాయుడు సిద్ధమవుతున్నారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి  సిఫారసు చేయాలని వెంకయ్య భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో పరిస్ధితి మరీ దిగజారింది. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. విపక్ష సభ్యుల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభలో ఎంపీలు సృష్టించిన గందరగోళంపై యాక్షన్ తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లుగా సమాచారం. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేయాలని వెంకయ్య భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదా కొత్త కమిటీని నియమించి చర్యలు తీసుకునే అంశంపై పరిశీలన జరుగుతుందని సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:మమ్మల్నే బెదిరించారు: విపక్షంపై ఏడుగురు కేంద్రమంత్రుల ఆరోపణ

కాగా, పార్లమెంటులో వీరంగం సృష్టించిన విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని, ప్రతిపక్షాల నిర్వాకం వల్లే పార్లమెంటు సమావేశాలను రెండు రోజులు ముందుగా నిరవధిక వాయిదా వేయాల్సి వచ్చిందని ఏడుగురు కేంద్ర మంత్రులు గురువారం అన్నారు. రాజ్య సభలో మార్షల్స్‌ తమపై దాడికి పాల్పడ్డారని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యచేసినట్టేనని రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ రోజు ఉదయం 15 పార్టీల ఎంపీలు నిరసనల చేసిన సంగతి తెలిసిందే. వారసలు మార్షల్స్ కాదని, బయటి వారినే సభలోకి అనుమతించారని, వారు మహిళా ఎంపీలపైనా దాడికి దిగారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ఏడుగురు కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఒక్కొక్కరు ప్రతిపక్షాల ఎంపీల తీరును ఎండగట్టారు.