సచిన్ పైలెట్కు ఊరట: రేపు హైకోర్టు తీర్పుకు గ్రీన్ సిగ్నల్, అనర్హతపై సుప్రీం కీలక ఆదేశం
రాజస్థాన్ లోని కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న సచిన్ పైలెట్ కు గురువారం నాడు పెద్ద ఊరట లభించింది. సచిన్ పైలెట్ సహా అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న సచిన్ పైలెట్ కు గురువారం నాడు పెద్ద ఊరట లభించింది. సచిన్ పైలెట్ సహా అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకొనే వరకు రాజస్థాన్ స్పీకర్ అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవద్దని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. అంతేకాదు ఈ నెల 24వ తేదీన తన తీర్పును వెల్లడించేందుకు రాజస్థాన్ హైకోర్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
అనర్హత నోటీసులపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ స్పీకర్ జోషీ బుధవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తమ నిర్ణయం వచ్చేవరకు రెబెల్స్ పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
also read:సుప్రీంకి రాజస్థాన్ స్పీకర్: సచిన్ వర్గం పిటిషన్పై తీర్పు ఇవ్వొద్దని పిటిషన్
సచిన్ పైలెట్ సహా 18 మంది మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు ఈ నెల 21న ఆదేశించింది. అంతేకాదు ఈ నెల 24వ తేదీన ఈ విషయమై తీర్పును వెల్లడించనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. దీంతో ఈ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జోషీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విఫ్ స్పీకర్ కు సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పీకర్ సీపీ జోషీ అసమ్మతి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు సచిన్ వర్గం.
పార్టీ ఫిరాయింపులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని జోషీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అధికారం తనకు ఉందన్నారు. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకొన్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని ఆయన ఇవాళ మీడియాకు చెప్పారు.