సోనూ సూద్ సంచలన నిర్ణయం.. టీవీ యాంకర్గా కొత్త అవతారం.. వివరాలివే
జాతీయ చానెల్ ఇండియా టుడే గ్రూప్ సోనూ సూద్ను యాంకర్గా ప్రవేశపెట్టనుంది. ఈ చానెల్ కొత్త చానెల్ గుడ్ న్యూస్ టుడేలో ప్రాసరం చేయనున్న ‘దేశ్ కి బాత్ సునాతా హూ’ ప్రోగ్రామ్కు ఆయన యాంకరింగ్ చేయనున్నారు. ఈ ప్రోగ్రాం రోజు రాత్రి 9 గంటలకు ఒక గంటపాటు ప్రసారం అవుతుంది.
న్యూఢిల్లీ: కరోనా కల్లోల కాలంలో నటుడు సోనూ సూద్ వేలాది మంది అభాగ్యులను ఆదుకుని ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా వందలమందిలో కొత్త ప్రేరణ, ఉత్తేజాన్ని నింపారు. కరోనా మహమ్మారి కాలంలో ఒక ఆశాద్వీపంగా వెలిగారు. లక్షల మందిలో పాజిటివ్ వైబ్స్ నింపారు. మానవీయతను చాటిచెప్పిన ఆయన ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న లక్షల మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఆర్తిగా చూసే కళ్లల్లో వెలుగులు నింపడానికి వెనుకాడని సోనూ సూద్ సరికొత్త అవతారంతో అందరి ముందుకు రానున్నారు.
ఓ జాతీయ చానెల్లో టీవీ యాంకర్గా మారనున్నారు. ఇండియా టుడే ప్రవేశపెట్టిన కొత్త ‘పాజిటివ్’ చానెల్ గుడ్ న్యూస్ టుడే చానెల్లో ఆయన గంట సేపు ప్రసారమయ్యే చానెల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘దేశ్ కి బాత్ సునాతా హూ’ అనే టైటిల్తో రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో తోటి మనుషులకు ఆదర్శంగా నిలిచిన కొందరి యోధుల పోరాటం, విజయాలను చర్చించనున్నారు. భారత్ సహా ఇతర దేశాల్లోనూ దేశాలు గర్వపడే పనులు, విజయాలు, స్ట్రగుల్స్ చేసిన వారి అనుభవాలపై మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని ఇండియా టుడే గ్రూప్ స్వయంగా వెల్లడించింది.
‘కరోనా మహమ్మారి కాలంలో సోనూ సూద్ మానవీయతను చాటిచెప్పారు. పాజిటివ్ ఎనర్జీకి, ఆదర్శానికి ఆయన ఒక వనరుగా ఉన్నారు. ఆయన మా గుడ్ న్యూస్ టుడే చానెల్కు సరిగ్గా సరిపోతారని భావిస్తున్నాం. గుడ్ న్యూస్లు, నవ్వుల పూవులు వికసించే వార్తలు ప్రసారం చేసే మా చానెల్లో ఆయన చేరిక మరింత జోష్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఆయన కొత్త అవతారంలో మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం’ అని ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్పర్సన్ కాలి పురీ వివరించారు. అయితే, ఈ ప్రకటనపై సోనూ సూద్ నుంచి ఇంకా స్పందన వెలువడలేదు.