MGNREGA budget: కరోనా సమయంలోనూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ.. ఆర్థికంగా అండగా నిలిచిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులో కోత విధించడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. తగిన కేటాయింపులు జరపడంతో పాటు 15 రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Sonia Gandhi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)కు బడ్జెట్లో కోత విధించడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు తమ ఖాతాల్లో రూ. 5000 కోట్ల మేర నెగిటివ్ బ్యాలెన్స్ కలిగి ఉన్నాయనీ, ఉపాధి హామీ కార్మికులకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని వాదించారు. జీరో అవర్లో ఉపాధి హామీ కూలీల సమస్యను లేవనెత్తిన సోనియా గాంధీ.. COVID-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వానికి.. ప్రజలకు అండగా నిలిచిన MGNREGA పథకానికి తగిన కేటాయింపులు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్మికులకు 15 రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
అయితే, సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, I&B మంత్రి అనురాగ్ ఠాకూర్ లు ఖండించారు. ఆమె ఈ సమస్యను రాజకీయం చేసిందని ఆరోపించారు. సోనియా వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. “గౌరవనీయ సభ్యులు లేవనెత్తిన అంశం సత్యదూరమైనది. 2013-14 (యూపీఏ ప్రభుత్వ కాలంలో)లో MGNREGA కోసం బడ్జెట్ కేటాయింపులు రూ. 33,000 కోట్లు కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ హయాంలో దాని కేటాయింపులు రూ. 1.12 లక్షల కోట్లకు చేరుకుంది. మాకు అద్దం చూపించాల్సిన అవసరం లేదు' అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
సోనియా గాంధీ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేస్తూ.. కొంతమంది వ్యక్తులు ఎగతాళి చేసిన MGNREGA, మహమ్మారి సమయంలో కోట్లాది మంది పేద కుటుంబాలకు సకాలంలో సహాయం అందించిందనీ, ప్రభుత్వానికి సహాయం చేయడంలో సానుకూల పాత్ర పోషించిందని సోనియా గాంధీ అన్నారు. “ఇప్పటికీ MGNREGA కోసం బడ్జెట్ కేటాయింపులో క్రమంగా తగ్గింపు ఉంది. ఈ సంవత్సరం MGNREGA బడ్జెట్ 2020 కంటే 35 శాతం తక్కువగా ఉంది. నిరుద్యోగం నిరంతరం పెరుగుతున్న సమయంలో ఇలా కేటాయింపులు తగ్గించడం దారుణం” అని సోనియా పేర్కొన్నారు.
బడ్జెట్ కోతలు సకాలంలో చెల్లింపు మరియు ఉపాధికి సంబంధించిన చట్టపరమైన హామీని బలహీనపరుస్తున్నాయని అన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ చెల్లింపుల్లో జాప్యాన్ని బలవంతపు పనితో సుప్రీంకోర్టు పోల్చిందని ఆమె పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ మరియు లోక్పాల్ నియామకానికి సంబంధించిన షరతులను నెరవేర్చకపోతే వారి వార్షిక లేబర్ బడ్జెట్ ఆమోదించబడదని రాష్ట్రాలకు చెప్పినట్లు సోనియా చెప్పారు."సోషల్ ఆడిట్ ప్రభావవంతంగా ఉండాలి కానీ దీని కోసం డబ్బును ఆపడం ద్వారా కార్మికులను శిక్షించలేము" అని ఆమె చెప్పింది."MGNREGA కోసం తగిన నిధులు కేటాయించాలని, పని చేసిన 15 రోజులలోపు కార్మికులకు చెల్లింపులు జరిగేలా చూడాలని మరియు వేతనాల చెల్లింపులో జాప్యం జరిగితే పరిహారం చెల్లించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను" అని సోనియా చెప్పారు.
ఇదిలావుండగా, యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి అనూరాగ్ ఠాకూర్ ఆరోపించారు. అయితే, దీనిని మోడీ ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద సృష్టించిన ఆస్తులను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు కార్మికులకు నేరుగా వారి జన్ధన్ ఖాతాల్లోనే చెల్లింపులు జరిగాయన్నారు. యూపీఏను ఉద్దేశించి సింగ్, ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలను ఖండించారు.
