అహ్మద్ పటేల్ మృతి.. సోనియాగాంధీ భావోద్వేగం
అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడిని తాను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. గొప్ప కామ్రేడ్ ని కోల్పోయానని సోనియా పేర్కొన్నారు.
సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(71) మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మరణంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడిని తాను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. గొప్ప కామ్రేడ్ ని కోల్పోయానని సోనియా పేర్కొన్నారు.
‘‘అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. విశ్వాసానికి, అంకితభావానికి ఆయన మారుపేరు. పూర్తి నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నెరవేర్చేవారు. సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు.
అహ్మద్ పటేల్కు ఉన్న దయాగుణమే ఇతరుల కంటే ఆయనను మరింత ప్రత్యేకంగా నిలిపింది’’ అని అహ్మద్ పటేల్తో పార్టీకి, తనకు ఉన్న అనుబంధాన్ని సోనియా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇక గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన అహ్మద్ పటేల్ సోనియా గాంధీ ఆంతరంగికుడిగా పేరొందిన విషయం విదితమే. కాగా కరోనా సోకడంతో పది రోజుల క్రితం(నవంబర్ 15న) ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
కాగా.. అహ్మద్ పటేల్ మరణంపై ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ‘అహ్మద్ పటేల్ జీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితంలోని అత్యధిక కాలం ప్రజాసేవలోనే గడిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన కుమారుడు ఫైజల్తో మాట్లాడాను. అహ్మద్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి’అని ప్రార్థించారు.