Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ లో ఢిల్లీ తరహా ఘటన.. తండ్రిని హత్య చేసి.. తల్లి సాయంతో ముక్కలుగా నరికి.. దారుణం...

పాలిటెక్నిక్ చదువుతున్న ఓ కొడుకు మాజీ నేవీ ఉద్యోగి అయిన తండ్రిని గొంతు నులిమి చంపాడు. ఆ తరువాత తల్లి సాయంతో శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. 

son and mother killed father, body chopped into 6 pieces in kolkata
Author
First Published Nov 21, 2022, 7:06 AM IST

కలకత్తా :  ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రద్ధాను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ దారుణంగా హత్యచేసి, 35 ముక్కలుగా నరికాడు. ఆ తరువాత ఆ శరీర భాగాలను.. ఢిల్లీ పరిసరాల్లోని ఆయా చోట్ల విసిరేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి దారుణమైన ఘటనే  పశ్చిమబెంగాల్లోని వెలుగుచూసింది. ఈ ఘటనలో ఓ కొడుకు తండ్రి గొంతు నులిమి చంపేసి.. ఆ తరువాత తల్లి సహాయంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. తాము దొరకకుండా ఉండడానికి.. తల్లీకొడుకులు ఇద్దరూ.. వాటిని ఆయా ప్రదేశాల్లో విసిరేశారు. 

పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరూయ్ పుర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. నావీలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి ఉజ్వల్ చక్రవర్తి(55)కి, పాలిటెక్నిక్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. తండ్రీకొడుకులిద్దరినీ  నవంబర్ 12న పరీక్ష ఫీజు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. 

ఈ తొక్కిసలాటలో కొడుకు ఆగ్రహంతో తండ్రిని గట్టిగా నెట్టేశాడు. ఆ ఊపుతో ఆయన విసురుగా వెళ్లి కింద పడ్డాడు. ఈ క్రమంలో కుర్చీకి తల తగిలి స్పృహ కోల్పోయాడు. ఇదే అదనుగా భావించిన కొడుకు తండ్రిని గొంతు నులిమి హత్య చేశాడు. ఇది చూస్తున్న తల్లి ఏమీ అనలేదు. ఆ తరువాత తల్లి సహాయంతో అందుబాటులో ఉన్న రంపంతో మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. 

షాకింగ్.. బంగ్లాదేశ్‌లో హిందూ యువతి హత్య.. చంపి, ముక్కలుగా నరికిన ప్రేమికుడు..

దీనికోసం తాను చదువుకుంటున్న పాలిటెక్నిక్ కార్పెంటరీకి సంబంధించిన క్లాసులు ఉపయోగించే కిట్ లోని రంపాన్ని వాడాడు. శరీరాన్ని ముక్కలుగా చేసి.. వాటిని వేర్వేరుగా ఆరు ప్లాస్టిక్ కవర్లలో చుట్టాడు. ఆ తరువాత వాటిని ఒక్కొక్కటిగా తన సైకిల్ మీద పెట్టుకుని.. ఒక్కో ట్రిప్ కు ఒక్కో శరీర భాగం ఉన్న కవర్ ను తీసుకువెళ్లాడు. ఇంటికి దూరంగా  ఆయా చోట్ల వాటిని విసిరేశాడు. ఆ తర్వాత తండ్రి ఉజ్వల్ కనిపించడం లేదని నాటకానికి తెరలేపారు. నవంబర్ 15 తెల్లవారుజామున తల్లీకొడుకులిద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. 

అయితే, ఇద్దరూ చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడంతో  పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తల్లీకొడుకులను గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిపోయిన కొడుకు చివరికి అసలు విషయం వెల్లడించాడు. తండ్రి ఉజ్వల్ తరచూ తనను, తల్లిని చిత్రహింసలకు గురిచేస్తుండేవాడిని, వాటిని భరించలేక హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కేసులో తల్లీకొడుకులే నిందితులుగా పోలీసులు తేల్చారు. వీరు తమ నేరాన్ని అంగీకరించారు. 

ఘటన జరిగిన రోజు కూడా కారణం లేకుండా తనమీద చేయి చేసుకున్నాడని కొడుకు ఆరోపించాడు. దీంతో జరిగిన పెనుగులాటలో తండ్రిని చంపేశామని చెప్పాడు. దీంతో  పోలీసులు తల్లీకొడుకులను అరెస్టు చేశారు. మృతదేహానికి సంబంధించిన రెండు కాళ్లను చుట్టుని ప్లాస్టిక్ బ్యాగులను  ఓ చెత్త కుప్ప నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఉజ్వల్ కు చెందిన తల, పొట్ట భాగాలు వీరి ఇంటి దగ్గర్లోని ఓ చెరువులో లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. చేతులు, మిగతా శరీరభాగాలు ఇంకా దొరకలేదని.. వాటి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios