పదిసార్లు లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. యూపీయే హయాంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్‌గా వ్యవహరించారు.

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్ కత్తాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఛటర్జీ 40 రోజుల క్రితం మెదడులో నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు.

మూడ్రోజుల తరువాత పరిస్థితి మెరుగవడంతో డిశ్ఛార్జి అయ్యారు. మళ్లీ మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాసపై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

1968లో సీపీఎం కార్యకర్తగా ప్రజాజీవితంలో మమేకమైన ఛటర్జీ అనతికాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. యూపీయే హయాంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్‌గా వ్యవహరించారు.