New Delhi: హిందూ పురాణాలను గురించి ప్రస్తావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అసుర రాజు హిరణ్యకశపుడితో కేంద్రంలోని బీజేపీ సర్కారును పోల్చారు. హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా భావించాడు.. నేటికీ కొందరు తమను తాము దేవుడిగా భావిస్తున్నారంటూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
Delhi Chief Minister Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. హిందూ పురాణాలను గురించి ప్రస్తావించిన ఆయన.. అసుర రాజు హిరణ్యకశపుడితో కేంద్రంలోని బీజేపీ సర్కారును పోల్చారు. హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా భావించాడు.. నేటికీ కొందరు తమను తాము దేవుడిగా భావిస్తున్నారంటూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. హిందూ పురాణాలను ప్రస్తావిస్తూ.. అసుర రాజు హిరణ్యకశిపునికి, కేంద్రానికి మధ్య పోలిక గీసి, "హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా భావించాడు... నేటికీ కొందరు తమను తాము దేవుడిగా భావిస్తున్నారని" ట్వీట్ చేశారు.
మనీష్ సిసోడియా అరెస్టుకు, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడి కింద పడిన బాధలకు మధ్య పోలికను ఆయన ట్వీట్ లో ప్రస్తావించారు. "దేశానికి, పిల్లలకు సేవ చేసిన ప్రహ్లాద్ ను జైల్లో పెట్టారన్నారు. కానీ అప్పుడు వారు ప్రహ్లాదుడిని ఆపలేకపోయారు.. ఇప్పుడు కూడా ఈ ప్రహ్లాదుడిని (సిసోడియా) ఆపలేరు" అని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 10 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్న తీహార్ జైలులో సిసోడియాను విచారించిన అనంతరం దర్యాప్తు సంస్థ ఈ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 26న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన ఆప్ నేతను మార్చి 20 వరకు కస్టడీకి అప్పగించారు. ఆయన బెయిల్ పై నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. సిసోడియా అరెస్టుపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సిసోడియా నిర్దోషి అనీ, ఆయన అరెస్టు కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆప్ ఆరోపిస్తోంది.
