మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొడుకు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే.. బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బీజేపీ నేతలు స్వార్థ రాజకీయాలతో కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ముంబయి: శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. డొంబివిలి యూనిట్కు చెందిన కొందరు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు బీజేపీ నేతలు స్వార్థపూరిత ఆలోచనలతో బీజేపీ, షిండే కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీకాంత్ షిండే ఏఎన్ఐతో మాట్లాడుతూ.. డొంబివిలీకి చెందిన కొందరు నేతలు బీజేపీ, షిండే కూటమి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారి స్వార్థ రాజకీయాల కోసం ఆటంకాలు తెస్తున్నారని వివరించారు. తనకు ఏ పదవి పైనా వ్యామోహం లేదని తెలిపారు. కూటమికి చెందిన సీనియర్ నేతలు ఏ క్యాండిడేట్ను ఎంచుకున్న తాను వారికి మద్దతు తెలుపుతానని చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ శివసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే తాము పని చేస్తున్నామని శ్రీకాంత్ షిండే వివరించారు. ఈ దిశగా చేస్తున్న తమ పనులను ఎవరైనా వ్యతిరేకిస్తే, ఎవరైనా ఆగ్రహిస్తే, కూటమికి ఆటంకాలు తెస్తే తాను తన పోస్టుకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Also Read: Mumbai Murder: రెండు బకెట్ల నిండా రక్తం, కొన్ని ముక్కలను ఉడికించి, రోస్ట్ చేసి.. నిందితుడికి హెచ్ఐవీ
శివసేన, బీజేపీ అన్ని ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు గత నెల సీఎం ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు. స్థానిక ఎన్నికలు మొదలు, శాసన సభ, లోక్ సభకు జరిగే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని వివరించారు.
