కోటి రూపాయల పాము విషం స్మగ్లింగ్... ఆరుగురు అరెస్ట్
దాదాపు 200కు పైగా కోబ్రాల నుండి సేకరించిన లీటర్ విషాన్ని తరలిస్తుండగా భువనేశ్వర్ ఫారెస్ట్ అధికారులు స్మగ్లర్లు పట్టుకున్నారు.
భువనేశ్వర్: పాముల్లోని ప్రమాదకర విషాన్ని సేకరించి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా ఒడిషాలో పట్టుబడింది. దాదాపు 200కు పైగా కోబ్రాల నుండి సేకరించిన లీటర్ విషాన్ని తరలిస్తుండగా భువనేశ్వర్ ఫారెస్ట్ అధికారులు స్మగ్లర్లు పట్టుకున్నారు. ఈ విషం విలువు దాదాపు కోటి రూపాయల వరకు వుంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇలా పాముల విషాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో ఓ మహిళ కూడా వుంది.
ఈ వ్యవహారానికి సంబంధించి డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ మిశ్రా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ''మేము ఒక లీటర్ పాము విషాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నాం. ఐదు మిల్లీలీటర్ల చిన్న చిన్న బాటిల్స్ లో నింపి ఈ విషాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ముగ్గురు పురుషులు, ఓ మహిళ కలిసి విషాన్ని సేకరించి కొనుగోలుదారులతో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయంపై తమకు సమాచారం అందడంతో దాడి చేసి ఈ విషాన్ని సేకరించాం. బహిరంగ మార్కెట్ లో ఈ విషం విలువ కోటి రూపాయల వరకు వుంటుంది'' అని పేర్కొన్నారు.
''దాదాపు 200 కోబ్రాల నుండి ఈ విషాన్ని సేకరించి వుంటారు. విషం స్మగ్లింగ్ తో సంబంధమున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. వారిపై జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం 9, 39, 44, 49 మరియు 51 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. అరెస్టయిన వారిని సోమవారం కోర్టుముందు ప్రవేశపెడతాం'' అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.