మరోసారి కేంద్రంపై పోరుకు సిద్ధమవుతన్న రైతన్నలు.. జనవరి 26న హర్యానాలో 'మహాపంచాయత్'
New Delhi: జనవరి 26న హర్యానాలో 'మహాపంచాయత్' నిర్వహించనున్న సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వెల్లడించారు. దానికి ముందు రైతులు తమ డిమాండ్లకు మద్దతుగా సంబంధిత అధికారులకు మెమోరాండంలను కూడా సమర్పించనున్నారు.
SKM-Kisan Mahapanchayat: పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం సహా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై అన్నదాతలు మరోసారి పోరుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వాన్ని మరోసారి తమ గొంతుకలను వినిపించడానికి కిసాన్ మహాపంచాయత్ లను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోకపోతే.. వరుస కిసాన్ మహాపంచాయత్ లను నిర్వహించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త ఆందోళనలు సైతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. దేశంలోని అన్ని రైతు సంఘాల గొడుగు సంస్థ అయిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జనవరి 26న హర్యానాలోని జింద్లో 'కిసాన్ మహాపంచాయత్'ను నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంయుక్త కిసాన్ మోర్చ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కర్నాల్లో జరిగిన సమావేశంలో ఎస్కేఎం నాయకులు కిసాన్ మహాపంచాయత్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాకేష్ టికాయత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్ సహా పలువురు రైతు సంఘాల నాయకులు పాలుపంచుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల మహాపంచాయత్ను జనవరి 26న జింద్లో నిర్వహించనున్నట్లు పాల్ తెలిపారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ట్రాక్టర్ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఎస్కేఎం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 26న కేంద్రంలోని, వివిధ
రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రను రైతు సంఘం బట్టబయలు చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
జనవరి 26న ఐక్యతా దినోత్సవం..
జనవరి 26ను ఐక్యతా దినోత్సవంగా పాటిస్తామని రైతు నాయకులు పాల్ తెలిపారు. అలాగే, కిసాన్ మహాపంచాయత్ కు ముందు రైతులు తమ డిమాండ్లకు మద్దతుగా సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నారని పేర్కొన్నారు. అలాగే, మార్చిలో ఢిల్లీలో 'కిసాన్ ర్యాలీ' నిర్వహించబడుతుందనీ, దాని తేదీని జనవరి 26 న జింద్లో ప్రకటిస్తామని సంయుక్త్ కిసాన్ మోర్చ తెలిపింది. కాగా, గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలు.. ఇప్పుడు రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు నాయకత్వం వహించిన SKM, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులపై కేసుల ఉపసంహరణ, రుణమాఫీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం గమనించదగ్గ విషయం. లఖింపూర్ ఖేరీ ఘటన, విద్యుత్ బిల్లు ఉపసంహరణ వంటి అంశాలను సైతం రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పంజాబ్లోని ఫిరోజ్పూర్లో డిస్టిలరీ, ఇథనాల్ ప్లాంట్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు సంయుక్త కిసాన్ మోర్చ (SKM) నాయకులు తమ సంఘీభావం తెలిపారు. వాయుకాలుష్యంతో పాటు పలు గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయనీ, డిస్టిలరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ సంఝా జిరా మోర్చా ఆధ్వర్యంలో గ్రామస్తులు గత ఐదు నెలలుగా ప్లాంట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి.