‘‘యాస్’’ రాకాసి గాలులు.. బీచ్ ఒడ్డున బయటపడ్డ 5 అస్థిపంజరాలు
భీకర గాలులకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడటంతో కలకలం రేగింది
అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఎందుకు జరుగుతాయో ఎవరికీ అర్ధం కాదు. ఫలానా సంఘటన కోసమే.. పరిస్ధితులు అన్ని సహకరించాయా అన్నట్లుగా వుంటుంది. ఇప్పుడు తమిళనాడులో అచ్చం ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను భారతదేశ తూర్పుతీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రచండ గాలుల తీవ్రతకు ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
ఈ క్రమంలో భీకర గాలులకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడటంతో కలకలం రేగింది. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి, ఎలా ఇక్కడకు వచ్చాయి. ఇవి సాధారణ మరణాలా లేక వీరిని ఎక్కడో హత్య చేసి తప్పించుకునేందుకు ఇక్కడ పాతిపెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also Read:3 లక్షల ఇళ్లు ధ్వంసం, లక్షలాది ఎకరాల పంట నష్టం : బెంగాల్కు కడగండ్లు మిగిల్చిన యాస్
జిల్లాలోని వలినొక్కం గ్రామం.. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదు వందల మత్స్యకార జనాభా జీవిస్తున్నారు. మృతదేహాలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సమీప పోలీస్ స్టేషన్లలో పాత మిస్సింగ్ కేసుల రికార్డులు పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్, డీఎన్ఏ ల్యాబ్లకు పంపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సైకో కిల్లర్ల్స్ కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు బలమైన ఆధారాలు ఏవీ లభించలేదు. మరోవైపు ఈ అస్థిపంజరాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం.