బోరుబావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు.. ఆడుకుంటుండగా కుక్క వెంటపడటంతో..
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని Behrampur గ్రామంలో ఓ ఆరేళ్ల బాలుడు 100 అడుగులకు పైగా లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఆదివారం బాలుడు ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని Behrampur గ్రామంలో ఓ ఆరేళ్ల బాలుడు 100 అడుగులకు పైగా లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఆదివారం బాలుడు ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపైన సమాచారం అందుకున్న జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్డీఆర్ఎఫ్) ఘటన స్థలానికి చేరుకుని బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీసుకొచ్చేందుక ప్రయత్నిస్తుంది. బాలుడికి ఆక్సిజన్ సరఫరా చేస్తూనే బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నట్లు అధికారులు తెలిపారు. బోర్బావిలో చిన్న కెమెరాను దించిన సహాయక సిబ్బంది బాలుడు ఉన్న పొజిషన్ను గుర్తించారు. బాలుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలుడిని రక్షించేందుకు ప్రత్యేక ఆర్మీ బృందాన్ని కూడా రప్పించారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. Hrithik అనే బాలుడు పొలంలో ఆడుతున్న సమయంలో కొన్ని వీధి కుక్కలు అతనిని వెంబడించాయి. దీంతో బాలుడు పరుగుతీశాడు. జనపనార సంచితో కప్పబడిన బోరుబావి పైపు పైకి ఎక్కాడు. ఇది భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉంది. అయితే బాలుడి బరువును తట్టుకోలేక బోరుబావిలో పడిపోయాడు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తల్లిదండ్రులు బిమలాదేవి, రాజిందర్ పొలాల్లో పని చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గడ్డివాలా పోలీసులు, చుట్టు పక్కల ప్రాంతాల జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 100 అడుగుల లోతులో చిన్నారి ఇరుక్కుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ సందీప్ హన్స్, ఎస్ఎస్పీ సర్తాజ్ చాహల్ కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, చిన్నారిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. “హోషియార్పూర్లో హృతిక్ అనే 6 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. నేను అడ్మినిస్ట్రేషన్తో నిరంతరం టచ్లో ఉన్నాను ... ”అని భగవంత్ మాన్ పంజాబీలో ట్వీట్ చేశారు.