జవాన్ల మధ్య వివాదం: తోటి జవాన్లపై కాల్పులు... ఆరుగురు ఐటీబీపీ సైనికులు మృతి
ఛత్తీస్గఢ్ ఐటీబీపీ క్యాంప్లో దారుణం జరిగింది. ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో అతనితో పాటు ఐదుగురు సైనికులు మరణించారు
ఛత్తీస్గఢ్ ఐటీబీపీ క్యాంప్లో దారుణం జరిగింది. ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో అతనితో పాటు ఐదుగురు సైనికులు మరణించారు. వివరాల్లోకి వెళితే... నారాయణపూర్ జిల్లా కేదార్నార్లోని 45వ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంపులో బుధవారం కొందరు జవాన్ల మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఈ సమయంలో వారి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఆగ్రహానికి గురైన మసుదుల్ రెహమన్ తన సర్వీస్ రివాల్వర్తో సహచరులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెహమాన్తో సహా ఆరుగురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని హెలికాఫ్టర్లో రాయ్పూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ మాట్లాడుతూ... జవాన్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఓ జవాన్ తోటి సహచరులపై కాల్పులు జరిపాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో రెహమాన్ తనను తాను కాల్చుకున్నాడా లేక అతని సహచరుల ఎదురుకాల్పుల్లో మరణించడా అనేది తెలియాల్సి వుంది.
ఇందుకోసం ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల రివాల్వర్లను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మరణించిన వారిని ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్స్ దుల్జీత్, ఎమ్ సింగ్, కానిస్టేబుల్స్ సుజిత్ సర్కార్, బిశ్వరూప్, బ్రిజేష్లుగా గుర్తించారు. గాయపడి వారిని ఎస్బీ ఉల్లాస్, సీతారామ్లు ఉన్నారు.