కేరళ బస్టాండ్లో ఒడిలో కూర్చునే వివాదం.. మళ్లీ నిర్మించిన బస్టాండ్
కేరళలో ఓ బస్టాండ్ చుట్టూ వివాదం రేగింది. యువతీ, యువకులు కలిసి బెంచీపై కూర్చోవడాన్ని కొందరు స్థానికులు తప్పుపట్టారు. ఆ బెంచీని మూడుగా విభజించారు. ఈ విషయంపై స్టూడెంట్లు నిరసనలు చేశారు. ఒడిలో కూర్చుని ఫొటోలు తీసుకోవడం ప్రారంభించారు. మేయర్ ఈ బస్టాండ్ పర్యటించి కామన్ బెంచీ ఏర్పాటు చేస్తామని, జెండర్ న్యూట్రల్ బస్టాండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. శుక్రవారం మూడు బెంచీలను తొలగించి మళ్లీ నిర్మించారు.
తిరువనంతపురం: కేరళలోని ఓ బస్టాండ్ వివాదానికి కేరాఫ్గా నిలిచింది. ఆ బస్టాండ్ సమీపంలో ఓ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఉన్నది. ఆ బస్టాండ్ ఎప్పుడు యువతీ యువకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ బస్టాండ్లో పెద్ద బెంచీ ఉన్నది. అది బస్టాండ్ పొడువూ ఉంటుంది. ఆ సీటులోనే లింగ బేధం లేకుండా బస్ కోసం ఎదురుచూసే యువతీ, యువకులు, ఇతరులు కూర్చునే వారు. అయితే, ఈ బస్టాండ్ చుట్టూ ఓ వివాదం రేగింది. ఆ ఒకే బెంచీపై అందరూ కూర్చోవడంపై కొందరు స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత ఆ బెంచీని మూడుగా విభజించారు. పురుషులు, మహిళలు వేర్వేరుగా కూర్చోవడానికి ఈ ఏర్పాటు చేశారు. దీంతో వివాదం సద్దుమణగలేదు. మరో వివాదానికి తెర లేపినట్టయింది.
బెంచీలను వేరు చేయడాన్ని కొందరు యువతీ యువకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో వారు ఒకరి ఒడిలో మరొకరు కూర్చుని ఫొటోలు దిగడం ప్రారంభించారు. ఇది కొత్త వివాదంగా మారిపోయింది. ఈ తరుణంలోనే జులైలో మేయర్ ఆర్య ఎస్ రాజేంద్రన్ శ్రీకార్యమ్ ఏిరయాలోని ఆ బస్టాండ్కు వెళ్లి పరిశీలించారు. జెండర్ న్యూట్రల్ బస్టాండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఆ బెంచీని మూడుగా విభజించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేరళ వంటి పురోగతి సాధిస్తున్న సమాజంలో ఇది తిరోగమన చర్య వంటిదని ఆక్షేపించారు. రాష్ట్రంలో యువతీ యువకులు కలిసి కూర్చోవడంపై నిషేధం ఏమీ లేదని స్పష్టం చేశారు. మోరల్ పోలీసింగ్నే ఇంకా అనుసరిస్తున్నవారు ప్రాచీన కాలంలో జీవిస్తున్నట్టేనని విమర్శించారు.
ఈ హామీ ఇచ్చిన రెండు నెలల తర్వాత శుక్రవారం మున్సిపల్ అధికారులు ఈ బస్టాండ్ను తొలగించారు. ఆ మూడు బెంచీలను తొలగించిన కామన్ బెంచీ ఏర్పాటు చేశారు.
ఈ బస్టాండ్లో బెంచీని మూడుగా విడగొట్టడాన్ని సీపీఎం యువజన శాఖ డీవైఎఫ్ఐ కూడా తప్పుపట్టింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం అని పేర్కొంది.