సిక్ మైండ్ వాదనలు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. అమిత్ షా పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఫైర్
Congress: శుక్రవారం సాయంత్రం పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడిన అమిత్ షా.. 2020లో ప్రధాని నరేంద్ర మోడీ రామజన్మభూమికి ఈ రోజు పునాది వేసినందున కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిరసన తెలిపేందుకు ఈ రోజును ఎంచుకుందని, ఇది బుజ్జగింపు రాజకీయాల సూక్ష్మ సందేశమని పేర్కొన్నారు.
Congress leader Jairam Ramesh: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా ఇతర ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వం ఆయా అంశాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నది. దేశంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా నియంతలా పాలన కొనసాగిస్తున్నారని కేంద్రంలోఒని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే, ప్రజా సమస్యల గురించి కాంగ్రెస్ చేస్తున్న నిరసనలను రామ మందిర స్థాపన దినోత్సవంతో ముడిపెట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సిక్ మైండ్ మాత్రమే ఇలాంటి వాదనలను తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ధరల పెరుగుదల, నిరుద్యోగం & GSTకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేటి ప్రజాస్వామ్య నిరసనలను దారి మళ్లించడానికి, దృష్టి మరల్చడానికి, ధ్రువీకరించడానికి.. హానికరమైన ట్విస్ట్ ఇవ్వడానికి హోం మంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. అటువంటి బూటకపు వాదనలను ఉత్పత్తి చేయగలిగేది జబ్బుపడిన మనస్సు (సిక్ మైండ్) మాత్రమే" అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
కాగా, శుక్రవారం సాయంత్రం పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడిన అమిత్ షా.. 2020లో ప్రధాని నరేంద్ర మోడీ రామజన్మభూమికి ఈ రోజు పునాది వేసినందున కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిరసన తెలిపేందుకు ఈ రోజును ఎంచుకుందని, ఇది బుజ్జగింపు రాజకీయాల సూక్ష్మ సందేశమని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు అంతకుముందు రోజు నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ "కాంగ్రెస్ నిరసన కోసం ఈ రోజును ఎంచుకుంది. నల్ల బట్టలు ధరించి నిసనకు దిగింది. ఎందుకంటే వారు తమ బుజ్జగింపు రాజకీయాలను మరింత ప్రోత్సహించడానికి సూక్ష్మమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజునే ప్రధానమంత్రి రామ జన్మభూమికి పునాది వేశారు అని అన్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని, ఆలయ నిర్మాణంపై కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కేవలం సాకులేనని" ఆయన అన్నారు.