విజయన్కి సుప్రీం షాక్: బక్రీద్కు కోవిడ్ ఆంక్షల సడలింపులపై ఆగ్రహం
సుప్రీంకోర్టు కేరళ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బక్రీద్ సందర్భంగా కోవిడ్ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వడంపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా మూడు రోజుల పాటు కరోనా నిబంధనలకు మినహాయింపులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వంపై మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది.లాక్డౌన్ నిబంధనలను సడలించాలన్న వ్యాపారుల డిమాండ్లకు కేరళ ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం షాక్ కు గురిచేసిందని సుప్రీం వ్యాఖ్యానించారు.
కేరళ ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా మూడు రోజుల పాటు ఇచ్చిన సడలింపులతో కోవిడ్ కేసులు మరింత వ్యాప్తి చెందితే చర్యలు తీసుకొంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కన్వర్ యాత్ర కేసులో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు కోరింది.బక్రీద్ ను పురస్కరించుకొని కేరళ ప్రభుత్వం ఇచ్చిన కరోనా సడలింపులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తమ వాదనను విన్పించాలని సుప్రీంకోర్టు కేరళ సర్కార్ ను సోమవారం నాడు కోరింది.
బక్రీద్ ను పురస్కరించుకొని వస్త్రాలు, ఆభరణాలు, ఫ్యాన్సీ దుకాణాలు, గృహోపకరణాలు విక్రయించే దుకాణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణాలను తెరుచుకొనేందుకు కేరళ సర్కార్ అనుమతిచ్చింది.ఈ విషయాన్ని కేరళ సీఎం విజయన్ ఈ నెల 17న ప్రకటించారు. ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు ఏ, బీ, సీ కేటగిరిలుగా వాణిజ్య దుకాణాలను తెరిచేందుకు అనుమతించారు.