ఏ క్షణంలోనైనా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే చాన్స్!.. సంజయ్ రౌత్ సంచలన ట్వీట్..
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ల భాగస్వామ్యంతో ఏర్పడిన మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ల భాగస్వామ్యంతో ఏర్పడిన మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్.. ఈ వార్తలకు బలం చేకూరిచ్చినట్టయింది. మహారాష్ట్రలో శాసనసభ రద్దు దిశగా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.
శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే.. తనకు మద్దతుగా ఉన్న నేతలలో క్యాంపు రాజకీయం మొదలు పెట్టడంతో.. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలుత ఏక్నాథ్ షిండేతో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టచ్లో ఉన్నట్టుగా ప్రచారం సాగినప్పటికీ.. ఆయనకు 30 మంది వరకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని కథనాలు వెలువడుతున్నాయి. శివసేనకు ఎమ్మెల్యేలతో పాటుగా,తనకు ఆరుగురు స్వతంత్రులతో కలిసి 46 మంది మద్దతు ఉన్నట్టుగా ఏక్నాథ్ షిండే చెబుతున్నారు. దీంతో మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడికి కష్టాలు ఎదురయ్యాయి. మరోవైపు బీజేపీకి శివసేన మద్దతు తెలపాలనే డిమాండ్ ఏక్నాథ్ షిండే వైపు నుంచి అల్టిమేటం వెలువడింది.
మరోవైపు ఏక్నాథ్ షిండేతో శివసేన జరుపుతున్న చర్చలు ఫలించడం లేదు. నిన్న ఉద్దవ్ ఠాక్రే, ఈరోజు సంజయ్ రౌత్.. ఏక్నాథ్ షిండేతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అయిప్పటికీ ఏక్నాథ్ షిండే నిర్ణయంలో మార్పు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరిగి బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే బదులుగా.. అధికారం కోల్పోయిన ఫర్వాలేదని ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పరోక్షంగా సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా.. ఇంకా రెండేళ్లు ఉండగానే అసెంబ్లీని రద్దు చేయాలనే నిర్ణయానికి ఉద్దవ్ ఠాక్రే వచ్చినట్టుగా తెలుస్తోంది.