పంద్రాగస్ట్ వేడుకలు.. త్రివర్ణ పతాకం కాదు, సిక్కు జెండా ఎగురేయండి : అకాలీదళ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
శిరోమణి అకాలీదళ్కు చెందిన ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 15న జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (75th independence day celebrations) ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘‘హార్ ఘర్ తిరంగా’’ (har ghar tiranga) పేరిట ప్రతి ఇంటిపైనా జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి జెండాలను పంపిణీ చేస్తున్నాయి కూడా. అయితే పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ పార్టీకి (shiromani akali dal) చెందిన ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’’ను బహిష్కరించాలన్న ఆయన.. ఆగస్ట్ 15న జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు . భారత దళాలను ‘శత్రువులుగా’’ వ్యాఖ్యానించారు. జర్నయిల్ సింగ్ బింద్రన్వాలే ఆ శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందారని సిమ్రన్ వ్యాఖ్యానించారు.
ALso REad:‘జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం’ వీడియోపై బీజేపీ ఎంపీ ఫైర్.. సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు
ఇదిలావుండగా.. ఖలిస్తాన్ నేత, వివాదాస్పద గురు పత్వంత్ సింగ్ పన్నూ (gurpatwant singh pannun) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలు త్రివర్ణ పతాకాన్ని కాల్చేసి .. ఖలిస్తానీ జెండాలను ఎగురువేయాలని పిలుపునిచ్చాడు. వీరిద్దరి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. బీజేపీ, ఆప్లు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. హర్ ఘర్ తిరంగాను బహిష్కరించాలని పిలుపునివ్వడం ద్వారా శిరోమణి అకాలీదళ్ తన స్వరూపాన్ని బయటపెట్టిందని అప్ మండిపడింది.
అటు పన్నూపై బీజేపీ నేత వినీత్ జోషి మండిపడ్డారు. పంజాబీ ప్రజలు ఖలిస్తాన్ను తిరస్కరించారని.. ఎంతోమంది శ్రమించి సాధించిన శాంతి విలువను వారు అర్ధం చేసుకున్నారని జోషి అన్నారు. ఐఎస్ఐ చెప్పినట్లుగా పన్నూ ఆడుతున్నాడని.. దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జోషి ఆరోపించారు. ఆయన ఎలాంటి పిలుపును ఇచ్చినా ప్రజల నుంచి స్పందన రాదని వినీత్ వ్యాఖ్యానించారు.