కల్పిత నవలల ఫొటో షేర్ చేసిన శశి థరూర్.. మోడీ పుస్తకం కూడా..!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మన దేశంలో ప్రస్తుతం ఆదరణలో ఉన్న కల్పిత కథలు ఇవేనంటూ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షించింది. ఆయన ఓ లైబ్రరీలోని పాపులర్ ఫిక్షన్ కేటగిరీ పుస్తకాలను ఫొటో తీసి ట్వీట్ చేశారు. ఆ కల్పిత నవలల విభాగంలో నరేంద్ర మోడీపై రాసిన ఓ పుస్తకం కూడా ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువతనంపురం ఎంపీ శశి థరూర్ తరుచూ ట్విట్టర్ అకౌంట్లో తన పోస్టులతో రంజింపచేస్తుంటారు. తన భాషతో అందరిని కట్టిపడేయడమే కాదు.. హాస్యభరిత సన్నివేశాలను, వ్యాఖ్యలను ఒద్దికగా పోస్టు చేస్తుంటారు. తాజాగా, ఆయన ఓ ట్వీట్ చేశారు. మన దేశంలో ఈ రోజుల్లో ఎక్కువగా ఆదరణ ఉన్న కల్పితాలు ఇవే.. ఓ సారి లుక్కేయండి అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. అందులో ఓ బుక్ హౌజ్ లేదా.. లైబ్రరీ ఫొటోను పెట్టారు. ఆ ఫొటో పాపులర్ ఫిక్షన్ కేటగిరీని చూపిస్తున్నది. ఈ కల్పిత నవలల విభాగంలో ప్రధాని మోడీపై రాసిన ఓ పుస్తకం కూడా కనిపించడం చర్చను లేపింది. కరోనా సంక్షోభ సమయంలో భారత్ను సమర్థంగా ముందుకు నడిపినట్టుగా ఆ పుస్తకం కవర్ పేజీ పేర్కొంటున్నది. ఎ నేషన్ టు ప్రొటెక్ట్ అనే టైటిల్, నరేంద్ర మోడీ ఫొటో ఉన్న ఈ పుస్తకం ప్రముఖ కల్పిత నవలల సెక్షన్లో ఉన్నది.
కాగా, బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు ఆ పార్టీపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెబుతూనే ఇప్పటికైనా బీజేపీ తన సొంత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదర్శాలను బీజేపీ అనుసరించడం లేదని విమర్శించారు.
‘‘ హ్యాపీ బర్త్డే BJP! మీకు ఈరోజు 42 ఏళ్లు. మీ సొంత రాజ్యాంగానికి అనుగుణంగా జీవించడం మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం కాదా ? మీరు నిజంగా ఇప్పుడు విశ్వసించేది లేదా ఆచరించేది మీ రాజ్యాంగం మొదటి పేజీలో కనిపించడం లేదు. లేకపోతే ఈ పత్రం కల్పితమేనా ?’’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు ఆయన బీజేపీ రాజ్యాంగం ఫొటోను కూడా షేర్ చేశారు.